The Latest

తిట్టడం ఒక యోగం..
తిట్టించడం ఒక భోగం..
తిట్టలేకపోవడం... ఒక రోగం.
అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు.
ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది.
అందుకే అలా.
ఏడుపొస్తే ఆపుకోవడం..
కోపమొస్తే తిట్టకపోవడం..
సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్
చేయలేకపోవడం లాంటిది.
అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా..



తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి.
గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి.
దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే..
What is the meaning of telugu word ne dumpa tega?
(నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది.
అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే.
ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు.

మొదటిది
ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిందే.

రెండోది
ఈ పదబంధం ఒక మందలింపు, హెచ్చరికని తెలుపుతుంది. కోప్పడడాన్ని, కేకలు వేయడాన్ని తెలియజేస్తుంది. సంభాషణలో ఒక వాక్యాన్ని ప్రారంభించే ముందు కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారు. (సోర్స్ : యూనివర్సిటీ ఆఫ్ చికాగో, డిజిటల్ డిక్షనరీస్ ఆఫ్ సౌత్ ఏసియా)
దీని దుంప తెగ. ఒక తిట్టు గురించి ఇంత వివరణా? అనుకోకండి. ఇక్కడ డిస్కషన్ డెప్త్ గురించి కాదు.. సోర్స్ గురించి. చికాగో యూనివర్సిటీలో కూడా ఈ పదానికి అర్థం లభించింది. అంటే తిట్లకు భాషకు ఏదో లింక్ ఉందన్నమాటే కదా! ఇంతకీ అర్థం ఏంటి అంటారా? తిట్లను అర్థం చేసుకోవాలిగానీ.. అర్థాలు అడగకూడదు.


ఆవేశంలో ఎవరినైనా నిందించడానికి వాడే పదాలని తిట్లు అంటారు.
తిట్లలో బూతులు దొర్లడం సహజం. కాని బూతు మాటలన్నీ తిట్లు కావు.
తిట్లు పీక్స్‌కి వెళ్లిపోతే బూతులవుతాయన్నమాట.
ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం తిట్ల గురించే.
దట్టూ.. వల్గర్‌గా కాకుండా వెరైటీగా ఉండే వాటి గురించి మాత్రమే.
మన పురాణాల్లో తిట్లు ఉన్నాయి.
‘పొగతాగని వాడు ఏదో అయి పుట్టున’ని.. కన్యాశుల్కం కూడా తిట్టింది.
కొన్ని తెలుగు సినిమా డైలాగులు.. చీవాట్లకు చిరునామాలు.
ఆ మధ్య ఒక సినిమాలో హ.. హ.. హాసిని.. ‘‘నాకు కొన్ని బూతులు నేర్పిస్తావా?’’ అని హీరోని అడగడం గుర్తుండే ఉంటుంది.
తిట్లు అడిగి మరీ నేర్చుకోవడం ఇప్పుడొక ట్రెండ్.
ఎప్పుడూ ఒకేలా తిట్టాలంటే.. తిట్టడానికి మీకు.. తిట్టించుకోవడానికి ఎదుటివాళ్లకూ బోర్ కొట్టదా? అందుకే మరి. కాస్త కొత్తగా.. ఇంకాస్త క్రియేటివ్‌గా తిట్టండి.


మేనరిజమ్ తిట్లు..
కొందరు ఎవరినైనా తిట్టాలంటే ఎప్పుడూ ఒకటే తిట్టుని వాడుతుంటారు. ఐదో తరగతి చదివేటప్పుడు మాకు ఆవు మాస్టారుండేవారు (ఆవు కథ చెప్పే టీచర్ కాదు.. వాళ్లింట్లో ఆవు ఉందన్నమాట) ఆయన వాడే ఒకే ఒక తిట్టు.. ‘ఓరి నీ పెళ్లాం మొగుడా’ అని. మొదట్లో తిట్టించుకోవడానికి బాగానే ఉండేది. రాను రాను.. బోర్ కొట్టింది. కాలేజ్‌కెళ్లాక ప్రిన్సిపాల్ కూడా ‘నీ ఫేసు’ అని ఒకే ఒక్క తిట్టు.. తిట్టి తిట్టి బోర్ కొట్టించాడు. అప్పటి నుంచే మొదలైంది ఈ అన్వేషణ.. ఆలోచన. కొత్తగా తిట్టలేమా? అని. అప్పుడే తిట్ల దండకం మొదపూట్టారు ‘హాస్య బ్రహ్మ’ జంధ్యాల. ఆయన సినిమాల్లో చాలా వెరైటీ తిట్లు ఆయన కనిపెట్టి తిడుతూనే చక్కిలిగిలి పెట్టారు. ఆ ఎఫెక్టే అనుకుంటు. ఈ మధ్య ఇంకా కొత్త తిట్లు వినిపిస్తున్నాయి.

తింగరి తిట్లు..
తిట్లలో.. ఆడాళ్ల తిట్లు.. మగాళ్ల తిట్లు ఉంటాయి. అమ్మాయిల తిట్లు.. హాట్ హాట్ పిజ్జాలా ఉంటే.. అబ్బాయిల తిట్లు.. ‘పచ్చి’ మిరపకాయ బజ్జీలా ఉంటాయి. వాటిని సెన్సార్ వారికి వినిపిస్తే ఆలోచించకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తారు. అందుకే వాటిని వదిలేద్దాం. దూకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ‘ఒబే సాలా’ అని కాస్త వెరైటీ కోసం ట్రై చేస్తోంది యూత్. ఇవి పాత తిట్లే.. అయినా ప్రొనౌన్సియేషన్‌ని కొత్తగా వాడడమే వెరైటీ. అమ్మాయిలను కామెంట్ చేయడానికి అబ్బాయిలు పెద్దగా ఆలోచించకుండానే చీవాట్లు దొరుకుతున్నాయి. తెలిసిన అమ్మాయి కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే ‘‘తెల్సులేమ్మా.. తెల్సు. నువ్వు ఇంట్లో సీతామహాలక్ష్మీ.. వీధిలో షీలాకీ జవానీ..’’ అని కామెంట్ చేస్తున్నారు.


ఆడ‘బిల్లా’లు
ఈ కాలం అమ్మాయిలు.. ఆడపిల్లలు కాదు.. ఆడ‘బిల్లా’లు.
‘‘బీపీ అంటే ఇలా ఉంటుందా సిద్ధూ? దగ్గరి నుంచి చూడడం ఇదే ఫైస్ట్ టైమ్’’ అని అమాయకత్వం ఒలకబోస్తూనే..
‘‘సచ్చినోడు.. ఆడ్ని.. కోసి కారం పెట్టాలి’’ అని మాస్ పటాస్‌లా పేలిపోతున్నారు కూడా. అంటే ఇంట్లో సుబ్బులు.. వీధిలో పబ్బులు.. కాలేజ్‌లో.. కే విశ్వనాథ్.. క్యాంటిన్‌లో కే రాఘవేంవూదరావు సినిమా హీరోయిన్ల టైప్ అన్నమాట.
తెలుగు బ్లాగులో ఒకాయన కొన్ని వెరైటీ తిట్లు పోస్ట్ చేశాడు. అది చదివిన ఒక అమ్మాయి ‘‘నైట్ టైమ్ కరెంటు పోయినప్పుడు చాలా కోపం వస్తోంది. ఆ ఎలక్షిక్టిసిటీ డిపార్టుమెంటు వాళ్లని తిడదామంటే సరైన తిట్లు దొరక బాధపడుతున్న. సరైన టైమ్‌లో మంచి హింట్స్ ఇచ్చారు’’ అని కామెంట్ రాసింది.

పిసినారి తిట్లు..
అంటే.. పిసినారిని తిట్టేందుకు వాడే తిట్లు. ఈ ప్రపంచంలో వీరికి ఉన్నన్ని తిట్లు.. ఇంకెవరికీ ఉండవు. బహుశా.. జంధ్యాల ఇన్‌స్పిరేషన్‌తోనే ఇవన్నీ పుట్టుకొచ్చాయనుకుంట.
- కాకి నోట్లోంచి బ్రెడ్‌ముక్క లాక్కునే అంట్ల కాకి
- యాక్సిడెంట్ అయితే 100కి మిస్డ్ కాల్ ఇస్తావా? 108ని లిఫ్ట్ అడుగుతావా?
- బూట్ పాలిష్ కుర్రాడిని డిస్కౌంట్ అడిగావట కదా?!
- అక్షయ పాత్ర ఇచ్చినా అడుక్కుతింటావ్!
- చీపురు కూడా నీకు చీప్‌ది కావాలా?
- తుఫాన్‌లో తువాలు పోయిందని ఫీల్ అయ్యే ఫేస్ నీది.
- ఏసీ కోసం ఏటీఎమ్‌కి వెళ్లి బ్యాలెన్స్ ఎక్వయిరీ చేస్తావ్

అమాయకులకు
ఈ తిట్లు అమాయక చక్రవర్తులకు అంకితం.
- అక్వేరియమ్‌లో చేపలు పట్టే ఫేసు
- ఏటీఎమ్‌లో పాన్‌కార్డ్ పెట్టి గీకావట కదా
- విమానం ఎక్కిస్తే.. కర్చీఫ్ వేసి సీటు బుక్ చేసుకుంటావా?
- మంచు కరిగించి.. మంచి నీళ్లని అమ్మే అవతారం
- మంచుతో చేసేది మంచూరియా అనుకుంటావా?
- ఆకలికి పురుగుల మందులో చక్కెర వేసుకుని తాగేవ్
- రాగి సంకటి అంటే రాగి తీగల్తో.. చేస్తారనుకుంటాడు
- పైరసీ సీడీలు అమ్ముకోరా అని ఐడియా ఇస్తే ఆరోగ్య శ్రీ యాడ్స్‌ని పైరసీ చేస్తావా?
- యూ ట్యూబ్‌లో.. ట్యూబ్‌లతో పాటు టైర్లు కూడా దొరుకుతాయట.
- హార్డ్‌డిస్క్ క్లీన్ చేయమంటే.. సర్ఫ్ ఎక్సెల్ వేసి నానబెడతావా..
-బ్లాక్‌లో టికెట్ కొన్నానంటే.. సినిమా కలర్ కదా అంటావా?...

దివాలా.. తికమక..
ఈ తిట్ల క్రెడిట్ వ్యాపారం చేసి దివాలా తీసినవారికి దక్కుతుంది. డల్‌గా కూర్చున్నవారిని.. సరాదాగా తిట్టాలంటే ఇవే కరెక్ట్. ‘రెండో ఫ్లోర్‌లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసినవాడిలా అలా పెట్టావేంట్రా ఫేసు..’ ఇలా అన్నమాట. ‘పంజాబ్‌లో సెలూన్ షాప్ పెట్టినట్లుంది నీ వ్యవహారం..’, ‘హిమాలయాల్లో ఐస్‌క్షికీమ్‌లు అమ్ముతా నంటావేంట్రా?’ ఇవన్నీ దివాలా తిట్లన్నమాట. ‘అమావాస్య అర్థపూరాతి కరెంటు పోయినప్పుడు.. నల్ల కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. మాడిపోయిన మసాలా దోసె తినే రకం నువ్వు’ ఇదో తికమక రకం తిట్టు. ‘కుక్క వెంటపడుతుంటే పరుగెత్తకుండా.. సెల్‌ఫోన్‌లో వొడాఫోన్ సిమ్ తీసేసే అటూ ఇటూ చూస్తాడు వాడు.. ’ ఇది ఇంకోటి.

పాంచ్ పటాకా
1 పాలకూర పప్పు..
2. బీడు బడిన బ్లేడు
3. రైమ్స్‌ని రీమిక్స్ చేసే ఫేసు
4. విగ్గుకి సెలూన్‌లో కటింగ్ చేయించే ఫేస్
5. కట్టింగ్ షాప్‌లో కత్తెర కొట్టుకొచ్చే రకం

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి.. 
కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్రమదేవి సమర్థవంతంగా ఎదుర్కొని తన పరిపాలనా దక్షతను చాటుకుంది. అంతఃకలహాలను ఎదిరించి.. అధికార పునరుద్ధరణ గావించి.. సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. సుస్థిర పరిపాలనకు పట్టం కట్టింది రుద్రమ. పాండ్యులు, వేంగి చాళుక్యులు, చోళుల వంటి శత్రువర్గాలను రూపుమాపి కొంచెం ఊపిరి తీసుకొనే లోపునే పరరాజ్య శత్రువులు రుద్రమదేవి మీదికి లంఘించారు. అబల కావడంతో ఆమెను అవలీలగా జయించవచ్చుననే భ్రమ వారిది. కానీ, రుద్రమ అబల కాదు, సబల అని వారికి తెలియదు. ఓరుగల్లు సింహాసనంపై ఒక అబల ఆసీనురాలైంది. అవలీలగా ఆ రాజ్యాన్ని గెలిచి విజయ కేతనం ఎగురవేయవచ్చు అనే ధైర్యంతో దేవగిరి యాదవ మహాదేవుడు రుద్రమపైకి దండెత్తి వచ్చాడు. అతడు ఎనిమిది లక్షల సైన్యంతో ఓరుగల్లుపైకి దూసుకొచ్చి దుర్గాన్ని ముట్టడించాడు. యుద్ధ వ్యూహం రచించడంలో, శత్రువుని అవలీలగా మట్టి కరిపించడంలో రుద్రమది అందె వేసిన చేయి.

మహదేవుని దాడికి ఏ మాత్రం బెదరక.. తానే స్వయంగా నాయకత్వం వహించి యుద్ధరంగాన నిలిచింది. అపార శక్తి సామర్థ్యాలతో అపర భద్రకాళిలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదిహేను రోజులకు పైగా భీకర పోరాటం చేసింది. శత్రువుని పడగొట్టాలంటే ముందు అతని బలం తెలుసుకోవాలి. ముందు ఆ బలాన్ని దెబ్బతీయాలి.
మహదేవుడి బలం అతని అశ్విక దళం. ఆ బలాన్ని, బలగాన్ని రుద్రమ సైన్యం సర్వనాశనం చేసింది.


ఊహించని ఈ పరిణామంతో మహదేవుడు తోకముడిచి దేవగిరి బాట పట్టాడు. కాకతీయ సేనానులు ఆ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టి దేవగిరి కోటనే ముట్టడించారు. రుద్రమ పరాక్రమాన్ని అధిగమించలేక మహదేవుడు ఓటమిని అంగీకరించి రుద్రమతో సంధి చేసుకున్నాడు. కప్పంగా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాడు. వితరణ శీలురాలైన ఆ రాణి యాదవులు ఇచ్చిన ధనాన్ని సైనికులకు పంచి పెట్టిందట. ఈ యాదవ దురాక్రమణ యత్నాన్ని, తత్పరాజయాన్ని సూచించే నిదర్శనాలు ఉన్నాయి. బీదరు కోటలోని ఆనాటి శాసనం ఈ విషయాన్ని, రుద్రమ విజయాన్నీ పేర్కొంటున్నది. రుద్రమ జరిపిన ఇలాంటి ఎన్నో పోరాటాల్లో ఆమెకు బాసటగా నిలిచిన సేనానులు చరిత్రలో చిరస్మరణీయులయ్యారు. వీరిలో గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు.

కాయస్థ నాయకుడైన జన్నిగదేవుడు ఆదినుంచి రుద్రమదేవికి అత్యంత విధేయునిగా ఉన్నాడు. జన్నిగదేవుని తర్వాత అతని తమ్ముడు త్రిపురాంతకుడు కూడా రుద్రమదేవి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. అనంతరం ఇతని తమ్ముడు అంబదేవుడు రాజయ్యాడు. ఇతనికి రుద్రమదేవి చెప్పుచేతల్లో ఉండడం, విధేయునిగా మసలు కోవడం ఇష్టం లేదు. తనకంటూ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని కాంక్షించాడు. కత్తి పట్టాడు. కాకతి రుద్రమ విధేయులయిన అనేక మంది మాండలికుల్ని తాను ఎలా గెలుచుకొచ్చిందీ త్రిపురాంతకం శాసనంలో అంబదేవుడు రాసుకున్నాడు. పాండ్యరాజస్య ప్రియప్రేషిత చండవేదండ తురంగ సార్థ విరాజమాన సంపోషిత సౌహార్థ్ర..(పాండ్యరాజు పంపిన ఏనుగులు, గుర్రాలతో పటిష్ఠమైన స్నేహం.. ), దేవగిరి రాజ ప్రసర్పిత ప్రాభృత మణి కనక భూషణ (దేవగిరి రాజు పంపిన మణి, కనక బహుమానాలతో భూషితుడను) అయ్యానని శాసనం వేసుకున్నాడు. ఇందులో రుద్రమదేవి పేరు వేయకుండా సామ్రాజ్ఞి పట్ల తన అవిధేయతను, స్వతంత్రాన్ని ప్రకటించుకునే ప్రయత్నం చేశాడు. పైగా రుద్రమదేవి శత్రువులైన పాండ్యులు, యాదవులతో స్నేహం చేశాడు. రుద్రమ ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ.. సామంతులను సంహరిస్తూ.. రాజ్యం విస్తరించుకున్నాడు అంబదేవుడు. ఇతని విజృంభణను రుద్రమదేవి ఎప్పటికప్పుడు అరికడుతూ, తన సేనానులతో అతనిని అదుపులో పెట్టింది. రుద్రమ ప్రాబల్యంతో అనేకసార్లు ఓటమి పాలైన అంబదేవుడు ఆమెపై కక్ష గట్టాడు. రుద్రమకు వ్యతిరేకంగా సామంతులను సమీకరిస్తూ .. చాపకింద నీరులా విస్తరించే ప్రయత్నం చేశాడు.

అంబదేవుడి ఆగడాలు ఎంతో కాలం సాగలేదు. రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడు యుక్త వయసుకు వచ్చాడు. రుద్రమ రాజ్య భార నిర్వహణలో చేదోడు వాదోడుగా నిలిచాడు. మహా పరాక్రమశాలి అయిన ప్రతాపరుద్రుడు అంబదేవుడు లాంటి వారి ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నాడు. అందుకు త్రిముఖ వ్యూహం రచించాడు. ఇందులో మధ్య వ్యూహం త్రిపురాంతకం వైపు నడిచింది. అదునుకోసం ఎదురుచూస్తున్న అంబదేవుడికి అండ దొరికింది. కుట్రలు కుతంత్రాలతో పాండ్యులు, చోళులు, ఇతర సామంత రాజులను ఏకం చేశాడు. ప్రతాపరుద్రునికి అండగా నిలువాల్సిన సేనలను కాకతీయులపైకే ఎక్కు పెట్టే ప్రయత్నం చేశాడు.
అంబదేవుడి కుట్ర తెలుసుకున్న రుద్రమ అపర భద్రకాళి అయి కత్తి పట్టి కదన రంగాన దూకినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అప్పటికి ఆమె వయస్సు ఎనభై ఏళ్లు. దాదాపు రెండు వారాలకుపైగా పోరాటం చేసిందనీ భావిస్తుంటారు. రుద్రమ ఈ యుద్ధ సమయంలోనే మరణించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కానీ ఎలా మరణించిందన్నది తెలియదు. రుద్రమను అంబదేవుడు యుద్ధంలో నేరుగా ఎదుర్కోలేక కపటోపాయం పన్నినట్లు భావిస్తుంటారు. యుద్ధ క్షేత్రానికి సమీపంలోని గుడారంలో కార్తీక సోమవారం సందర్భంగా రుద్రమ ప్రత్యేక పూజలు చేస్తుండగా, ఈ విషయం ముందే తెలుసుకున్న అంబదేవుడు అంతకు ముందే పూజారుల స్థానంలో తన వాళ్లను పంపాడనీ, పూజలో నిమగ్నమైన రుద్రమను అంబదేవుడి మనుషులు వెనుక నుంచి పొడిచి చంపారని చెబుతుంటారు. కొందరు విషప్రయోగం చేశారనీ వాదిస్తుంటారు. రుద్రమ సేనాని మల్లికార్జున నాయకుడు కూడా ఆమెతోపాటే మరణించడంతో ఇద్దరూ యుద్ధరంగంలోనే చనిపోయారని ఇంకొందరు భావిస్తుంటారు. అయితే, చారిత్రకంగా ఈ విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.

పానగల్లు శాసనాన్ని బట్టి మల్లికార్జున నాయకుడు రుద్రమదేవికి సర్వసైన్యాధ్యక్షుడని తెలుస్తోంది. మల్లికార్జునుడి కొడుకు ఇమ్మడి మల్లికార్జున నాయకుడు కుమార రుద్రదేవ మహారాజుకు ధర్మువుగా 1290లో శాసనం వేయించాడు. నల్లగొండ జిల్లా చందుపట్లలో లభించిన శాసనంలో రుద్రమదేవి మరణం గురించి ఉంది. రుద్రమ, మల్లికార్జునుడు ఒకేసారి యుద్ధంలో శివసాయుజ్యం పొందినట్లు ఈ శాసనం పేర్కొంది. శివసాయుజ్యం పొందిన కాకతి రుద్రమదేవి, మల్లికార్జున నాయకులకు ధర్మువుగా పువ్వుల ముమ్మడి అనే బంటు సోమనాథ దేవునికి కొంత భూమిని దానం ఇచ్చినట్లు ఈ శాసనం పేర్కొంది. దీన్నిబట్టి శాసనం(నవంబర్ 27, 1289) వేయించిన కొన్ని రోజులకు ముందు రుద్రమ మరణించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవలే వెలుగులోకి వచ్చిన మేడిమల్‌కల్ శాసనం ఈ విషయాన్ని బలపరచడమే కాకుండా ఆమె మరణించిన వెంటనే ఆమె మనుమడు ప్రతాపరుద్రుడు కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడని స్పష్టం చేస్తోంది. రుద్రమ మరణానంతరం ఆ యుద్ధంలో ప్రతాపరుద్రుడు అంబదేవునిపై ప్రతీకారం తీర్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. సర్వాన్ ఆంధ్ర మహీపతీన్ రణముఖే జిత్వా యశోలబ్ధవాన్ అని త్రిపురాంతకం శాసనం అంబదేవుడి గురించి గొప్పగా చెబుతున్నది. నిజమే, అంబదేవుడు అంతటి పరాక్రమశాలియే అయితే.. యుద్ధ రంగాన ఎవరిని ఎలా చంపాడో శాసనాల్లో స్పష్టంగా పేర్కొని ఉండేవాడు. రుద్రమవంటి మహా సామ్రాజ్ఞిని నిజంగానే జయించి ఉంటే ఈ విషయాన్ని సగర్వంగా ప్రకటించుకుని ఉండేవాడు. తాను రుద్రమదేవిని చంపానని అంబదేవుడు తన శాసనాల్లో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు. ఓ వృద్ధ స్త్రీని దొంగ దెబ్బ తీసి చంపానని చెప్పుకోవడం తనకే పరువు నష్టం కలిగించేది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావించకపోయి ఉండవచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు.
(7th may 2017)



ఆదిమానవుడు ఆకులు కప్పుకునేవాడు. చెట్ల తొర్రలలో నివసించేవాడు. ఒక రాయిని మరొక రాయితో రాపడించి నిప్పు పుట్టించేవాడు. రాతి పాత్రలతో..  పరికరాలతో పని వెళ్లదీసుకునేవాడు. కానీ ఆదిమానవుడు  ఉండేవాడు?  ఏ విధమైన జీవనశైలి అవలింబించేవాడు?..  ఈ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం తెలియకపోయినా.. అక్కడక్కడా అతని ఆనవాళ్లు బయటపడు తుంటాయి. అలాంటి ప్రాంతాల్లో పజ్జూరు ఒకటి.  ఆదిమానవుడి ఆనవాళ్లు ఈ ఊరిలో వెలుగు చూస్తున్నాయి. తొలిచారిత్రక యుగం  దొరల పాలనాకాలమైన 20వ శతాబ్ది మధ్య వరకు విశిష్ట రాజ్య పరిణామాలు పజ్జూరులో అవశేషానవాళ్లుగా కనిపిస్తున్నాయి.



గ్రామం: పజ్జూరు   మండలం: తిప్పర్తి    జిల్లా: నల్లగొండ    పిన్: 508247    జనాభా: 3320    వృత్తి: వ్యవసాయం
తూర్పు: ఎర్రగడ్డల గూడెం   పడమర: సందనపల్లి    దక్షిణాన: పెద్ద సూరారం   ఉత్తరాన: కురువేణిగూడెం
అక్షరాస్యత: 67శాతం



ఎక్కడ ఉంది?: 
నల్లగొండ జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో.
ప్రత్యేకత ఏంటి? : సుమారు రెండు వేల ఏళ్ల చరిత్ర పజ్జూరు సొంతం. శాతవాహనులు.. కళ్యాణీ చాళుక్యులు.. రాష్ట్ర కూటులు.. కాకతీయులతో ఈ గ్రామం అనుబంధం కలిగి ఉన్నట్లు ఆనవాళ్లు లభిస్తున్నాయి.



పురావస్తు తవ్వకాలు 
పజ్జూరుది ఆది నుంచీ ఘనమైన చరిత్రే. తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన శాతవాహనుల హయాంలో పజ్జూరు ప్రముఖ పరిపాలనా కేంద్రంగా వర్ధిల్లినట్లు ఆధారాలున్నాయి. ఇటీవల పురావస్తుశాఖ తవ్వకాల్లో లభించిన అవశేష ఆనవాళ్లు వీటిని తెలియజేస్తున్నాయి. కుండపెంకులు.. మట్టిపూసలు.. టెర్రకోట స్త్రీ ప్రతిమలు.. మట్టి గాజులు.. దంతపు గాజులు.. తిలకం దిద్దుకునే కొనేరియం రాడ్.. కార్నేలియం.. జాస్ఫర్.. డిజైన్ కుండ.. ఇటుకలతో నిర్మించిన కట్టడాలు బయటపడ్డాయి. వీటిలో చేత్యాలు ఉండడంతో ఇక్కడ బౌద్ధ మతం కూడా ఫరిడవిల్లినట్లు పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. శాతవాహనుల సామంతులైన మహాతలవరస సీసం, రాగి నాణేలూ లభించాయిక్కడ.



పాటిగడ్డ మట్టి
2001వ సంవత్సరంలో పజ్జూరుకు చెందిన పులిజాల వెంకటరమణ ఇంట్లో ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నట్లు ఆయన సోదరి చెప్పడంతో తవ్వకాలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఇది చర్చనీయాంశమైంది. పజ్జూరు సమీపగ్రామమైన చిన్న సూరారానికి చెందిన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అనుములపూరి రామ్‌లక్ష్మణ్‌కు ఈ విషయం తెలిసింది. పురావస్తు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తికి విషయం చెప్పి పజ్జూరును సందర్శించాల్సిందిగా ఆదేశించారు. ఆయన గ్రామంలో పర్యటించారు. ఇక్కడి ఇండ్ల మట్టి గోడలలో ఉన్న ఎరుపు.. నలుపు కుండ పెంకులను చూసి గ్రామస్తులను అడిగారు. ఆ మట్టి చారిత్రక ప్రదేశమైన పజ్జూరు పాటిగడ్డ నుంచి తీసుకొచ్చిందని చెప్పడంతో పురావస్తు శాఖ ఈ గ్రామంపై దృష్టి సారించింది.




శిల్పకళాకృతి 
కళ్యాణీ చాళుక్యులు.. రాష్ట్రకూటులు.. కాకతీయుల కాలంలోఆలయాలు ఇక్కడ నిర్మించి ఉంటారు. వాటిలో ఒక శివాలయం ఇప్పటికీ ఉంది. శాతవాహన కాలంలో టెర్రకోట శిల్పాలు ఆలయ శిల్పాలపై అపురూపంగా కనిపిస్తాయి. శైవతత్వం ప్రబలంగా మనుగడలో ఉన్నకాలంలో ప్రతిష్టించిన  చాముండి ఆలయం నేడు ఊరు దేవత ముత్యాలమ్మగా పూజలందుకుంటున్నది. ఈ గుడి సమీపంలోనే పలుచని పరుపు బండపై వీరగల్లులు ఉన్నాయి. ఇవి కాకతీయ పాలనను చూపిస్తున్నాయి.



రుద్రమ నడిచిన బాట 
కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఓరుగల్లు నుంచి బయలుదేరి పిల్లలమర్రి.. ఇనుపాముల.. చందుపట్ల.. పజ్జూర్ గ్రామాల్లో సేద తీరుతూ పానగల్లు చేరుకునేవారని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. స్వయంగా రుద్రమనే పజ్జూరులో నాగ దేవతారాధన చేపట్టినట్లు ఇక్క డ లభించిన ఆధారాలను బట్టి చెప్పొచ్చు. గ్రామం చుట్టూ నాగుపాముల విగ్రహాలు ఉంటాయి. నాగులచవితి.. నాగ పంచమి  రోజుల్లో గ్రామస్తులు ఇక్కడ పూజలు చేస్తుంటారు. పజ్జూరులో ప్రధానంగా చెప్పుకునేది పెద్ద చెరువు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు నిర్మించారు.




శాసనం చెప్పే చరిత్ర 
ఎర్రగడ్డలగూడెం అనుబంధ గ్రామమైన గుర్గుబావి దగ్గర ఉన్న శిలాశాసనం గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనను తెలియజేస్తుంది. క్రీస్తుశకం 1602లో రాయించిన శిలా శాసనం పజ్జూరు విశిష్టతను చెప్తున్నది. వీరి కాలంలో పానగల్ సర్కార్ కింద పజ్జూరు (పరగణ)గా ఉండేదట. దీని కేంద్రంగా పాలన చేస్తున్న పానగంటి నర్సనాయినం బ్రాహ్మణులకు భూమి ఇనాం ఇస్తే వీరి సేవకుడైన చామ సర్వయ్య కుమారుడు వెంకటయ్య వినాయక విగ్రహం.. శిలా శాసనం వేయించారని గ్రామస్తులు చెప్తుంటారు. పజ్జూరు పరగణాలో పానగంటి వంశస్తుల పాలన క్రీస్తుశకం 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు సాగినట్లు చెబుతారు.





ఆదిమమానవుడి ఉనికి 
పజ్జూరులో పెద్దరాతియుగం మానవుడి స్మారక శిల (మెన్‌హీర్).. ఎర్రగడ్డలగూడెంలో ఆదిమ మానవుడి రాక్షసగూళ్లు ఉన్నట్లు పురావస్తుశాఖ వాళ్లు ఇటీవలే నిర్ధారించారు. రాక్షసగూడు పెద్ద డయాతో 235 అడుగుల వృత్త పరిధి.. 78 అడుగుల వ్యాసార్ధం.. 50 పెద్ద గండ్ర శిలలతో వృత్తాకారంలో నిర్మించి  ఇది ఉమ్మడి రాష్ట్రంలోనే అతి పెద్దదని చరిత్ర కారులు.. ఆర్కియాలజీ అధికారులు నిర్దారించారు. దీనికి సమీపంలోనే బండపై ఆదిమ మానవుడు తన జీవన గమనంలో వాడిన రాతి ఆయుధాలను పదును పెట్టిన ఆనవాళ్లు కనపడుతున్నాయి. రాతి గొడ్డండ్లు.. వడిసెల రాళ్లు.. పసర్లు నూరే ఫెజల్స్ ఈ ప్రాంతంలో విరివిగా లభించాయి.
మురళి రాగి, 7702510250



మరికొన్ని చిత్రాలు..











 


నాడు.. రామదాసు నిలువనీడలేని శ్రీరాముడికి గుడి కట్టిస్తే..  నేడు.. ఈ పరమదాసు నరసింహుడికి గుట్టనే గుడిగా మలిచి ఇచ్చాడు!  
కాకులు దూరని కారడివిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చి.. అనంత శోభ తీసుకొచ్చాడు! ఆయనో ఆధ్యాత్మిక వేత్త కాదు.. అతి సాధారణ ఓ పశువుల కాపరి!
 భక్తిని శక్తిగా మార్చుకుని.. దైవసేవనే లోకసేవగా భావించి.. గుట్టను తొలిచి గుడిని చేశాడు! ఆలయమే ఇల్లుగా.. నారసింహుడి సేవే పరమావధిగా యావత్ జీవితాన్ని దైవపూజకు అంకితం చేశాడు! 
85 ఏళ్ల వయసులోనూ.. వెల్చాల్ శ్రీలక్ష్మీ నరసింహస్వామికి నిత్య పూజారిగా సేవ చేస్తున్న పరమదాసు యాదవ్‌ను పరిచయం చేసుకుందాం!

యాభై ఏండ్ల క్రితం అదొక కాకులు దూరని కారడవి. పశువుల కాపరులు మాత్రమే కనిపించే నిర్మాణుష్య ప్రాంతం. అలాంటిది ఇప్పుడు పచ్చని చెట్లతో.. ప్రకృతి రమణీయతతో పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం పూజా వైభవకాంతితో కళకళలాడుతున్నది. ఈ అద్భుత సృష్టికి కారణం ఒక సామాన్యుడు. అంతులేని భక్తి ప్రపత్తులతో నారసింహుడిని కీర్తిస్తున్న పరమదాసు యాదవ్.

వర్షం మార్చిన జీవితం 
వికారాబాద్‌జిల్లా వెల్చాల్ గ్రామ సమీపంలో ఉంది ఈ ప్రాంతం. ఒకప్పుడు దట్టమైన చెట్లతో కారడవిని తలపిస్తూ పులులు సంచరించడంతో ఈ గుట్ట ప్రాంతాన్ని పులిలొంకగా  పిలుస్తారు. ఆ గుట్టకు పశువులను మేపేందుకు వెళ్లేవారు పరమదాసు. వర్షంవస్తే తలదాచుకోవడం కోసం గుట్టను తొలచి చిన్నపాటి స్థావరం ఏర్పరచుకున్నారు. ఒకరోజు కురిసిన కుండపోత వర్షం ధాటికి తట్టుకోలేక మిగిలినవాళ్లంతా ఇంటికి వెళ్లిపోతే ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. రాత్రి కలలో నరసింహస్వామి కనిపించి తనకూ గుట్టపై చోటు కల్పించాలన్నారట!

తిరిగి ఇంటికెళ్లలేదు 
మరుసటి రోజు స్నేహితులంతా గుట్టకు వెళ్లారు. పొద్దుమూకంగానే ఇంటికెళ్లిపోయారు. పరమదాసు మాత్రం ఇక ఇంటికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. స్వామి ఆజ్ఞానుసారం గుట్టను తవ్వడం ప్రారంభించారు. ఆకలి.. దప్పికలనూ మరచిపోయి రాత్రింబవళ్లు గుట్టను తొలిచారు. రోజూ కష్టపడుతూ సొరంగం లాంటి దొనను తొవ్వారు. పరమదాసు ప్రయత్నానికి గ్రామస్తుల సహకారం లభించింది. లక్ష్మీ నరసింహుడిని ప్రతిష్టింపజేసి ప్రతీ సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

గుట్టల్లో అద్భుతం 
బయట నుంచి చూస్తే మామూలు గుట్టల్లాగే పులిలొంక కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే అద్భుతాలు కనిపిస్తాయి. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ సమయంలో ఇంత పెద్ద దొనను ఒంటరిగా ఆవిష్కరించడం నిజంగా అద్భుతమేనంటారు ఈ ప్రాంతాన్ని దర్శించినవారు. నున్నటి గోడలతో కనిపించే దొన లోపలిభాగం పూతపూసినట్టుగా ఉంటుంది. అదంతా పరమదాసు చేతిమాయే. ఆ కళాత్మకత చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. గుట్ట మొదట్లో పరమదాసు తవ్వించిన గుండంలో నీరు ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది!

స్వామికే తెలుసు 
ఇంత పెద్ద గుట్టను తొలిచి గుడిగా మలిచిన వ్యక్తి బాగా బలిష్టుడై ఉంటాడనుకోవచ్చు. కానీ పరమదాసు మాత్రం బక్కపలుచని మనిషి. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇతరుల చేతితో ఏం పెట్టినా తినరు. మంత్రాలు.. తంత్రాలు వంటివి ఆయనకసలు తెలియవు. ఆడంబరాలు ఉండవు. ధోతి.. బనీను.. మెడలో జపమాల.. భుజాలపై ఒక గొంగడి.. ఇదే ఆయన ఆహార్యం. ఎవ్వరికీ ప్రత్యేక ఆహ్వానాలుండవు. అంతా ఆ స్వామికి తెలుసు.. నన్నూ ఆయనే నడిపిస్తున్నారు. మీ బాధలు.. కోర్కెలు ఏమైనా ఉంటే ఆయనతో చెప్పుకోండి అంటూ భక్తులకు తనవంతు సలహా ఇస్తుంటారు తప్ప వేరే ఏమీ సందేశాలివ్వరు పరమదాసు. స్వామి ఆదేశానుసారమే ఇదంతా చేశానని.. ఆయనే చేయించుకున్నాడని చెప్తారు!

మరెన్నో ఆలయాలు
లక్ష్మీ నర్సింహుడికే కాదు ఈ గుట్టపై మరెన్నో దేవాలయాల్ని స్థాపించి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చారాయన. బద్రీనాథేశ్వరస్వామి, మల్లిఖార్జునస్వామి, ఆంజనేయ స్వామి, నాగేశ్వర స్వామి.. వేరువేరు ఆలయాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే మార్గంలో ఉంటుంది వెల్చాల్. అక్కణ్నుంచి ఆటోల్లో నరసింహస్వామి గుట్టకు చేరుకోవచ్చు. నడిచి కూడా వెళ్లొచ్చు. మొక్కులు తీర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వంటావార్పు చేసి స్వామికి నైవేద్యం సమర్పించి ఇంటిళ్లిపాది భోజనాలు చేసి వెళ్తుంటారు.

ఉత్సవ వైభవం! 
ఆయనెప్పుడో యువకుడిగా ఉన్నపుడు స్వామికి అంకితమయ్యాడు. ఇప్పుడాయన వయసు 85 సంవత్సరాలు. ఇన్నాళ్లు ఒంటరిగా సేవ చేస్తున్న పరమదాసు వయోభారాన్ని అర్థం చేసుకుని గ్రామస్తులు ఓ కమిటీ వేసుకుని పర్యవేక్షణ చూస్తున్నారు. గుట్ట పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఊళ్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుంచి గుట్ట వరకు స్వామివారి ఉత్సవ విగ్రహానికి నిర్వహించే రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. హోలీ పండగకు మూడు రోజుల ముందు ఉత్సవాలు ముగుస్తాయి.ప్రభుత్వ సహకారం లభిస్తే ఈ క్షేత్రం మరింత అభివృద్ధ్ది చెందే అవకాశం ఉంది. గొప్ప పర్యాటక క్షేత్రంగానూ మారుతుందంటున్నారు గ్రామస్తులు.

ఎలా వెళ్లాలి?
బస్సులో అయితే హైద్రాబాద్ ఎంజీబీస్ నుంచి వికారాబాద్ చేరుకుని.. అక్కణ్నుంచి సదాశివపేట వెళ్లే బస్సుల్లో వెల్చాల్ కు చేరుకోవచ్చు. హైద్రాబాద్ నుంచి బీదర్ వెళ్లే బస్సుల్లో సదాశివపేటకు వచ్చి.. అక్కణ్నుంచి వికారాబాద్ వెళ్లే బస్సుల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడికి రైలు సదుపాయం కూడా ఉంది. బీదర్ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ఇతర ప్యాసింజర్ రైళ్లు, వెల్చాల్‌కు సమీపంలో ఉన్న మొరంగపల్లి (సదాశివపేట్ రోడ్) స్టేషన్‌లో ఆగుతాయి. అక్కణ్నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీనరసింహాస్వామి క్షేత్రం ఉంటుంది.

Story by Santosh Kumar pyata, 
source : Namasthe Telangana


అబ్బ.. ఏం కాంబినేషనబ్బ ఇది? వింటేనే నోట్లో ఊరీలొస్తున్నాయి! చెరువులో నీళ్లుండి.. చేతినిండా పని ఉన్న రోజుల్లో.. చేను ఒడ్డుపై కూర్చుని రొయ్యల కూర తింటుంటే.. ఆ రుచుల ఘుమఘుమలు కిలోమీటర్ దాకా వెళ్లేవంట! చాలారోజుల తర్వాత చెరువుల్లో నీళ్లొచ్చాయి.. చేపలు.. రొయ్యల పెంపకానికి మంచిరోజులొచ్చాయి! తెలంగాణ నాటుదనపు ఘాటు వంటకమైన 
ఈ రొయ్యల వెరైటీలను మనమూ రుచి చూస్తే.. ఆ మజాయే వేరప్పా.! 

అరిటాకు రొయ్యలు


aritaku

కావాల్సినవి :


రొయ్యలు : 200 గ్రా, కారం : ఒక టీస్పూన్, పసుపు : అర టీస్పూన్, గరం మసాలా : అర టీస్పూన్, అరటి ఆకు : ఒకటి, కొత్తిమీర : ఒక కట్ట, పుదీనా : ఒక కట్ట, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :


ముందుగా రొయ్యలను బాగా కడిగి పెట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీన్ని అరిటాకులో చుట్టి నిప్పుల మీద కాల్చాలి. బాగా కాలిన తర్వాత ఆకు నుంచి తీయాల్సి ఉంటుంది. వీలైతే మరో అరిటాకు తీసుకొని ఈ కూరను అందులో పెట్టి సర్వ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. 

చిట్టి ముత్యాల రొయ్యల పలావ్


pulav

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., బియ్యం : 250 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, గరం మసాలా : పావు టీస్పూన్, మిరపకాయలు : 2 టీస్పూన్స్, కొత్తిమీర : అర కట్ట, పుదీనా : అర కట్ట, ఉల్లిపాయ : 1, నెయ్యి : 2 టీస్పూన్స్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్స్, నూనె : 2 టీస్పూన్స్,ఉప్పు : తగినంత 

తయారీ :

ముందుగా రైస్ నానబెట్టాలి, ఆ తర్వాత రొయ్యలు కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగాక, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, రొయ్యలు వేయాలి. ఇవి వేగిన తర్వాత బియ్యం వేసి సరిపడా నీళ్లు పోయాలి. సన్నని మంట మీద అన్నం ఉడికే వరకు అలాగే ఉంచాలి. చివరగా నెయ్యి వేసి పదిహేను నిమిషాల పాటు దమ్ మీద అన్నాన్ని ఉడికించాలి. సూపర్ పులావ్ నోరూరిస్తుంది. దీన్ని రైతాతో తింటే కూడా చాలా బాగుంటుంది. 

రొయ్యల బూందీ


bhundi

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., కార్న్‌ఫ్లోర్ : 50 గ్రా., మైదా : 50 గ్రా., కారం : ఒక టీస్పూన్, ధనియాల పొడి : ఒక టీస్పూన్, మిరపకాయలు : 50 గ్రా., వెల్లుల్లి : 50గ్రా, అల్లం : 50 గ్రా. కొత్తిమీర : ఒక కట్ట, ఉప్పు, నూనె : తగినంత 

తయారీ :

రొయ్యలను కడిగి పెట్టుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఈ రొయ్యలను డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లో వేసి పక్కన పెట్టాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. ఇవి వేగాక ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, చివరగా వేయించుకున్న రొయ్యలను వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి..వేడి రొయ్యల బూందీ రెడీ!

చింతచిగురు ఎర్ర రొయ్యలు


chinta-chiguru

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., చింతచిగురు : 50 గ్రా. శనగపప్పు : 100 గ్రా.,
కారం : ఒక టీస్పూన్ 
పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, 
గరం మసాలా : అర టీస్పూన్, 
కరివేపాకు : 2 రెమ్మలు, 
పచ్చిమిర్చి : 2ఉల్లిపాయలు : 2, 
కొత్తిమీర : ఒక కట్ట ఉప్పు, నూనె : తగినంత 

తయారీ :

శనగపిండిని పప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. రొయ్యలను కూడా మంచిగా కడిగా పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీంట్లో రొయ్యలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా, చింత చిగురు వేసి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత ఉడికించిన పప్పు వేసి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచాక కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే చింతచిగురు ఎర్ర రొయ్యలు మీ ముందుంటుంది. 

వంకాయ రొయ్యల కూర


vankaya

కావాల్సినవి :

రొయ్యలు : 200 గ్రా., వంకాయలు : 100 గ్రా., ఉల్లిపాయ : 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి : 2, కొత్తిమీర : అర కట్ట, గరం మసాలా : ఒక టీస్పూన్, నూనె : 2 టీస్పూన్స్, చింతపండు రసం : 2 టేబుల్‌స్పూన్స్ , పసుపు : అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్ , ఉప్పు, కారం : తగినంత 

తయారీ :

కడాయిలో నూనె వేసి గరం మసాలా దినుసులు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీంట్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆ తర్వాత వంకాయలు వేసి మూత పెట్టుకోవాలి. ఇవి కాస్త వేగాక రొయ్యలు వేయాలి. ఇవి కాస్త వేగాయనుకున్నాక చింతపండు రసం వేసి కాసేపు మరగనివ్వాలి. ఇందులో ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి సన్నని మంట మీద కాసేపు ఉండనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. రుచికరమైన వంకాయ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. 

నదీ ప్రవాహంలోకి కొత్త నీరు వచ్చినప్పుడు పాతనీరునూ కలుపుకొని పోతుంది. పాతని నెట్టేసి కొత్తది ముందుకు పోలేదు. ఈ రెండింటి మధ్య తరాల అంతరం ఉంది. నిన్నటి తరం ఒంటెద్దు బండిలో వెళ్తున్నది. ఈ తరం కారు వేగంలో వెళ్తున్నది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ కట్ అయిపోతోంది. దూరం అంతకంతకూ పెరిగిపోతున్నది. ఆ తరమైనా ఈ తరమైనా కొత్తను పట్టుకోవాలి. పాతను పట్టుకెళ్లాలి అంటారు ప్రముఖ రచయిత, నటుడు ఎల్బీ శ్రీరాం. కడుపు నింపుకోవడానికి ఆయనింకా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మనసు నింపుకోవడానికి తనకు తాను ఇంకేదో చేయాలని ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ పేరుతో ఎల్బీ శ్రీరామ్ షార్ట్ (హార్ట్) ఫిల్మ్స్ చేస్తున్నారు. ఈ తరం ఆయన బండి ఎక్కలేదు. అందుకే కలిసి వెళ్లొచ్చు.. వేగంగా వెళ్లొచ్చు.. భావాలూ పంచుకోవచ్చు అని ఆయనే మన కారు ఎక్కి కూర్చున్నారు. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం అంటున్నారు. ఏమిటా ప్రయాణం?

నమస్తే అండీ! కావడి బద్ద వదిలేసి టీషర్టు వేసుకుని కారెక్కారు.. ఎలా ఉంది ప్రయాణం?

నమస్తే! బావుంది. అనుకున్నదానికంటే పదిరెట్ల ఉత్సాహంగా కూడా ఉంది.

రచయితగా.. నటుడుగా.. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు ఉన్న మీరు ఇంటర్‌నెట్ రంగంలోకి ఎందుకు అడుగు పెట్టాలనిపించింది? 

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక గొప్ప తృప్తి ఉంది. విజయం తెచ్చిన గర్వంలేదు గానీ.. దానితో వచ్చిన గౌరవం ఉంది. చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. వీటన్నింటితో జనరేట్ అవుతున్న ఒక పవర్‌తో కొత్తగా.. ఇంకేదో చెయ్యాలన్న తపన. అందుకే ఈవేళ ప్రపంచాన్ని ఏలుతున్న ఇంటర్‌నెట్ రంగంలోకి అడుగుపెట్టాను. నా భావాలు ఈ తరం వారికి విసుగు రప్పించకూడదనే.. షార్ట్ ఫిల్మ్స్‌ను ఎంచుకున్నాను. ఆ భావాలు నా గుండెల్లోంచి వచ్చినవే కాబట్టి వాటికి ఎల్బీ శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నాను. 


ఎలాంటి హార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు? మీ జోనర్ ఏమిటి?
నా జోనర్ వేరు. వలువలు విప్పడం కాదు.. విలువలు చెప్పడం. నీతి కథ కాదు. నాది జాతి కథ. దేశం నా టాపిక్ కాదు.. మనిషి నా టాపిక్, టార్గెట్. నా పాండిత్యం నన్నయ్య పద్యం కాదు.. వేమన పద్యం. నాకు తెలిసింది పువ్వు.. చెట్టు. మనిషి.. మట్టి. పువ్వంటే ఇష్టం.. సెన్సిటివ్‌గా ఉంటుందని. సువాసనను ఇస్తుందని. చెట్టంటే మరీ ఇష్టం. సిన్సియర్‌గా రోజూ పువ్వులిస్తుందని. మనకన్నీ మట్టి నుంచే వచ్చాయి. మనమూ మట్టిలోనే పోతాం. ఆ మట్టి రంగేంటి? విత్తనం నాటితే.. వచ్చే మొక్క రంగేమిటి? దాని పువ్వు రంగు.. దానికి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఆశ్చర్యం. ఎన్ని వింతలు?? ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనం దేని కోసం పరుగుడెతున్నాం. అంతా కృత్రిమం. బిజీలైఫ్. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాం. అక్కర్లేనివన్నీ పోగేసుకుంటూ పోతే.. కావాల్సినవన్నీ పొగొట్టుకుంటాం. పాతవి పక్కకు జరిపేస్తున్నాం. మంచం.. పాతది. తీసెయ్. డబుల్ కా..ట్. కుండ వద్దు.. ఫ్రిడ్జ్. అన్నీ కృత్రిమమే. ఎన్ని కొత్తవి.. ఎన్ని కొత్త రోగాలు. 

అంటే కొత్త వద్దా?
నాదీ ఇదే ప్రశ్న. కొత్త వద్దా? అక్కడే ఉందామా? బావి దాటి బయటికి రావొద్దా? అంటే.. కొత్త కావాలి. అక్కడే ఉంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. కొత్తదెప్పుడూ పట్టుకోవాలి. కానీ పాతదాన్నీ పట్టుకెళ్లాలి. అప్పుడు అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఎక్కువ. కాశీకి వెళ్తే తిరిగిరాడని.. వాహనం అంటే ఒంటెద్దు బండి అని.. కమ్యూనికేషన్ అంటే ఉత్తరమని.. రేడియోలోకి మనుషులు దూరి ఎలా మాట్లాడతారు.. ఒకప్పటి ఇలాంటి వింతల్ని దాటి వచ్చేశాం. ఒక్కసారిగా గేట్లు తెరుచుకున్నాయి. ఎన్నో అవకాశాలు. పరుగెడుతున్నాం. చాలా కనిపెడుతున్నారు. ఎంతో సాధిస్తున్నారు. కానీ ఎందుకీ ప్రగతి? ఒక గంటకు 124 గంటల పనులు పెట్టుకున్నాం. హడావిడి.. ఆరాటం.. పోటీ ప్రపంచం.. అన్నీ ఉంటాయి. కానీ అన్నింటికీ మొహం మొత్తి ఉంటాం. ఈ ప్రయాణంలో ఏం కోల్పోతున్నాం. తాజ్‌మహల్ చూడ్డానికి వెళ్తున్నాం. కానీ మధ్యలో దాని కంటే అందమైన దృశ్యాలు ఎన్ని చూడకుండా వెళ్తున్నాం. అందుకే నేనంటాను. గమ్యం కాదు.. ఆ ప్రయాణం నాకిష్టం.

నాటకాలు.. రచనలు.. నటుడిగా సినిమాలు మీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో.. ఎంతో అనుభవం. దాని నుంచి కమర్షియల్ సినిమాలు చేయొచ్చు. కానీ మీరు షార్ట్ ఫిల్మ్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు?
మనం రిటైర్మెంట్ ఎందుకు పెట్టుకున్నాం. జీవన వేగంలో పడి ఎన్నో కోల్పోతాం. చేయలేని పనులు చేయడానికి.. ఆస్వాదించలేనివి.. ఆస్వాదించడానికి. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో ఉండాలి. ఇప్పుడు నాకు కావాల్సింది సిక్స్‌ప్యాక్ కాదు.. ఆరోగ్యం. అందుకే జాగింగ్ నుంచి వాకింగ్‌కు వచ్చాను. ఇవాళ నాకు టైమ్ ఉంది. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది. కానీ కళాకారునికి కాదు. నేను నాటకాల నుంచి వచ్చాను. ఒకప్పుడు నాటకం వేస్తే ఎలా ఉండేది? సూర్యోదయం చూపించాలంటే.. తెల్ల కర్టెన్ వెనకాల స్పాట్‌లైట్ పెట్టి పైకి లేపితే.. జనం నిలబడి చప్పట్లు కొట్టేవాళ్లు. ఇవాళ సినిమాలో సూర్యోదయాన్ని ఎన్ని రకాలుగా చూపించొచ్చు. అయినా సహజత్వాన్ని మనం ఫీల్ అవ్వడం లేదు. గ్రాఫిక్స్ అంటున్నాం. తెలిసిపోతుంది. పాతను వదులుకుంటున్నామనే బాధ. కొత్తను కనుక్కోలేకపోతున్నామనే బాధ. 

పాత కొత్తల మధ్య వారధిగా ఏం చెప్పబోతున్నారు?
ఎంత బహుముఖ ప్రజాశాలి అయినా ఒకసారి ఒక పని చేస్తాడు. ఆదాయం లేకపోయినా అభిరుచిని చంపుకోలేక నాటకాలు దాటి వచ్చాం.. తర్వాత సినిమాలు.. బాధలు.. బ్రేక్.. తర్వాత.. బిజీ.. ఎప్పుడూ ఖాళీగా లేను. కానీ షార్ట్‌ఫిల్మ్స్ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా 15 ఏళ్ల నుంచి. వయసు మళ్లిన క్రికెటర్లు.. కామెంట్రీ చెప్పినట్లు.. నేనిప్పుడు ఇదే పని చేయాలి. కడుపు నింపడానికి కమర్షియల్ సినిమాలు ఎలాగూ వస్తూనే ఉన్నాయి. మనసు నింపుకోవడానికే నాకు నచ్చిన పని నేను చేయాలి. ఎన్నో మలుపులు.. ఎన్నో గెలుపులు.. కానీ ఈ ప్రాసెస్‌లో నా కొడుకును ఎత్తుకుని ఆడించే అనుభూతిని పొందలేదు. సమయంలేదు. ఇప్పుడు ఉంది. కనీసం వాడి మనవడిని అయినా ఎత్తుకుని ఆడిస్తా. ఏమో రేపు వాడే నాకంటే గొప్పవాడు కావచ్చు. 

ఒకప్పుడు కథ చెబుతా అంటే వినేవారు. చెప్పేవారూ ఉండేవారు. ఈతరాన్ని పట్టుకోవడం ఎవరి తరమూ కావడం లేదు. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ప్రపంచం అరచేతిలోకొచ్చేసింది. ఆ హస్తభూషణం మనిషిని భిన్నత్వంలో ఏకాకిని చేసేసింది. ఒకప్పుడు అశీల్లం చదవాలంటే పుస్తకాల్లో పుస్తకం దాచి పెట్టి ఎంతో రహస్యంగా చదివేవారు. ఇప్పుడు కాలం మారింది. విచ్చలవిడితనం వచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోనూ దొరుకుతు ంది. అలాంటివి ఎన్నో ఉన్నవాటి మధ్య నేను నిలబడి యూట్యూబ్‌లో ఓ నీతి కథ చెబుతున్నాను. నచ్చినవారు చూస్తున్నారు. ఆదరణ, స్పందన వస్తున్న కామెంట్లను బట్టి అర్థమవుతున్నది. వందలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారందరికీ నచ్చుతుంది. ఇంకా ఎక్కువమందికి ఎలా చేరుకోవాలన్నదే తదుపరి లక్ష్యం. నిజం నిద్రలేచేలోపు అబద్ధం ఆకాశం దాకా వెళ్లి వస్తుంది. మంచి కూడా అంతే మెల్లగా ఎక్కుతుంది. 

ఇప్పటికి నాలుగు లఘుచిత్రాలు చేశారు.. ఇంకెన్ని చేస్తారు? ఎంతకాలం చేస్తారు?
ఇన్ని చేయాలి.. అన్ని చేయాలని రూల్ ఏం పెట్టుకోలేదు. ఆదరాభిమానాలను బట్టి చేసినంతకాలం చేస్తాను. ఇప్పుడు నెలకు రెండు చిత్రాలు చేస్తున్నాను. స్పందనను బట్టి పెంచాలో తగ్గించుకోవాలో చూస్తా. అభిరుచి ఉంది కానీ.. ఆదాయం ఉండదు. ఉన్న పది రూపాయల్లో ఓ రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నాను. అంతకుమించి చేసే పనిలో సంతృప్తి పొందుతున్నాను. ఉత్సాహంగా.. సంతోషంగా ఉన్నాను. అన్ని పనులూ నేను చేసుకుంటున్నాను. చదువుకుంటున్నాను. కథలు ఎంచుకుంటున్నాను. కథనాలు రాసుకుంటున్నాను. ఆర్థికంగా ఇవ్వాల్సిన వారికి ఇస్తున్నాను. సహాయం చేయాల్సిన వారు చేస్తున్నారు. 24 క్రాఫ్ట్స్ అవసరం పడుతున్నది. యువతరంతో కలిసి యువకుడిలా పనిచేస్తున్నాను. 

యువతరంతో కలిసి పనిచేస్తున్నారు. కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారా? ఇస్తే ఎలాంటి అవకాశం ఇస్తారు?
తప్పకుండా అవకాశం ఇస్తా. ఇస్తున్నాను కూడా. అవకాశం మాత్రమే. ఆశిస్తున్నది మాత్రం కాదు. ఆర్థికంగా ఎంత తక్కువలో చేసుకోగలిగితే అన్ని ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు. టెక్నికల్ వ్యాల్యూస్ కంటే హ్యూమన్ వ్యాల్యూస్‌కే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాను. నేర్చుకోవాలి.. ఏదో సాధించాలన్న తపన ఉన్నవారికి.. సాంకేతిక నిపుణులకు.. ఉత్సాహం ఉన్నవారికి నాతో కలిసి నడిచే అవకాశం ఇస్తాను.

పండగ


రెండు రోజుల్లో పండగ. పెట్టట్టుకుని దిగిపోతారు.. అల్లుడు కూతురు అని ఆమె కంగారు పడుతుంది. అన్నీ వస్తుంటాయి.. పోతుంటాయి.. నువ్వు కంగారు పడకు.. ఇల్లుంది.. ఆవుంది.. నేనున్నాను.. నవ్వుతూ చెప్తాడతడు. ఆ పోతుంది.. అల్లుడి ముం దు మన పరువు. మీ మొఖానికి నవ్వు.. ఆ ఆవుకు పేడ తప్ప ఏమీ రావు.. అని చిరాకు పడుతుంది. పేడ.. ఆయనకో ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో వారింట్లో పండగ ఆనందంగా గడిచిపోతుంది. ఏమి టా ఐడియా అన్నది యూట్యూబ్‌లోనే చూడాలి. పాడి-పంట లేకపోవచ్చు! కానీ పేడతో కూడా పండగ చేసుకోవచ్చు!! అనేది సందేశం. 

మా నాన్న


ఈ కథ నిడివి ఏడు నిమిషాలే అయినా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల వారి గుండెల్ని తాకే విస్తృతి ఉంది. రాకరాక ఊరి నుంచి నాన్న వస్తాడు. డబ్బుల కోసమేమోనని కోడలు కంగారు పడుతుంది. కానీ ఆ తండ్రి పొలంలో కాసిన వేరుశనక్కాయలతో పాటు ఇరవై వేల రూపాయలు కూడా ఇస్తాడు. అది చూసి కొడుకు నాన్న మీ ఆర్నెళ్ల కష్టం. మరి మీ ఖర్చులకి? అని అడుగుతాడు. అందుకు తండ్రి మాదేముందిరా డొక్కా డోల్కా మంటెట్టుకున్నా వంటైపోద్దీ. మీకు బోలెడు ఖర్చులున్నాయి అని చెప్పడం బిడ్డల బాగు కోసం తండ్రి నిస్వార్థంగా, సునాయసంగా చేసే త్యాగానికి నిదర్శనం. 

ప్రసాదం


అమెరికా వెళ్లిన కొడుకు ఊరి గుడి కోసం డబ్బు పంపిస్తాడు. దాంతో ఏం చేయాలి? అన్నదానికి అ మృతం కురిసిన రాత్రిలాంటి అద్భుతమైన ఆలోచన వస్తుంది తండ్రికి. అక్షరాల్ని మోసుకురావడం ఆయా సం అనుకోవద్దు అంటారు ఎల్బీ. గుళ్లో ప్రసాదంగా అరటిపండు, కొబ్బరి చిప్ప ఇస్తారు.. వాటి బదులు పుస్తకాలు ఇవ్వాలనుకోవడం ఈ చిత్రంలో సందేశం. అరటిపండు అరగంటలో అరిగిపోతుంది. కొబ్బరి ప చ్చడి ఓ పూటకొస్తుంది. కానీ పుస్తక జ్ఞానం జీవితాంతం వెంట వస్తుంది. కొత్త కొత్తగా ఆలోచిస్తున్న కొత్త తరానికి ఈ కొత్త సంవత్సరంలో మీ ఆలోచన కొత్త గా ఉంది నాన్నగారు అని కొడుకు సంతోషిస్తాడు. 

ఉమ్మడి కుటుంబం


ఊళ్లో సొంతింటికి రావడంతో ఆనందంగా ఉం టాడు ఆనందరావు. కానీ ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరి మొహాల్లోనూ సంతోషం లేదు. అందరిదీ ఉరుకులు పరుగుల జీవితం. అందరితో ఆనందంగా ఉందామ ని ఎన్నో ఆశలతో వచ్చిన ఆనందరావు.. డిజప్పాయింట్ అవుతాడు. వారందరిలో ఆనందం నింపడానికి అతను ఏం చేశాడన్నది కథ. సంతోషం అనేది వెతికితే దొరకదు. పక్కనే ఉంటుంది. అది ఎవరికి వారు సంపాదించుకునే వందనోటు కాదు. ఒకరికొకరు ఇ చ్చి పుచ్చుకునే వస్తుమార్పిడి. ఒకప్పుడు ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఉమ్మడి కుటుంబాలు ఉండే వి. ఇప్పుడవి చిట్లిపోయి చిన్న చిన్న కుటుంబాలైపోయాయి. అదృష్టవశాత్తూ మనకిప్పుడు అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది. అదే ఇవాళ్టి ఉమ్మడి కుటుంబం. 
- నగేష్ బీరెడ్డి 
photos ; కంది సన్నీ







ఒక చిన్న తోట.. అందులో ఇలాంటి ఓ చిన్న ఇల్లు.. అక్కడే కాసిన కూరగాయలు.. అప్పుడే పెట్టిన కోడిగుడ్లు.. ఆవు పాలు.. వేప పుల్ల.. ఈత పళ్ళు.. తాటి కల్లు.. ఇంకేం కావాలి జీవితానికి?

ఇలాంటి తోట ఉండీ అనుభవించలేక పోవడం సెల్ ఫొన్ లో బ్యాలెన్స్ ఉండీ అవుట్ గోయింగ్ కాల్ చెయ్యలేక పోవడం లాంటిదే కదా?

"నీ బాంచెన్ కాల్మొక్తా'' అన్న సామాన్యులు తుపాకీ పడితే ఏమైతదో తేలిన రోజులు..
"నైజాం సర్కరోడా.. నీ గోరి కడతం కొడుకో..'' అంటూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యానికి, దొరల, భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం జరుగుతున్న తరుణం..
కడుపు మండిన నిరుపేదల ఆవేశం ముందు ఏ ఆయుధం నిలవదని నిజాం గ్రహించి లొంగిపోయిన అనంతర కాలం..
సుబేదార్లు.. జాగీర్దార్లు.. షేర్వానీలు విడిచి ఖద్దరు చొక్కాలు తొడుక్కుని నయా బానిసత్వానికి తెరలేపిన సమయం..
భూమి కోసం.. భుక్తి కోసం.. తెలంగాణ విముక్తి కోసం..
కూలీ జనం కణ కణ రగిలే నిప్పులై.. కరకర పొడిచే పొద్దులై, చరచర పొంగే ఉప్పెనలై ఎగబడిన తీరు ప్రపంచ విప్లవోద్యమానికి కొత్తదారులు వేసింది. ఆ దారుల్లో ఉద్యమోన్ముక్తులైన అనేకమందిలో.. రణదివిటీ.. ఈ రంగక్క. అలియాస్ నజియా!
కొన్ని వేల మరణాల తర్వాత ఒక జననం..
జననం అంటే ఇక్కడ పుట్టుక కాదు..
ఒక రూపు రావడం.. పుస్తకం రాయడం పూర్తి కావడం.. 
తొమ్మిదో నెలలో ప్రసవ వేదన కాదు..
తొమ్మిది నెలలుగా అంతర్మథనం..
Oka Nazia Kosam రాయడం పూర్తయింది.
అతి త్వరలో మీ చేతుల్లోకి రాబోతోంది..
ఆదరిస్తారని ఆశిస్తూ...
- నగేష్ బీరెడ్డి











*Shall we meet today for lunch* 
ఒక మెసేజ్ ఎప్పుడో వచ్చి సెల్ ఫోన్ Inboxలో కూర్చుంది. 
ఎవరు పంపిండ్రో. ఊరు లేదు. పేరు లేదు. ఆలోచిస్తూ ‘but who r u ?’ రిప్లయి ఇచ్చా
‘ananya’ రిప్లె వచ్చింది. 
అనన్య? ఎవరీ అనన్య?? ఆరు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు గుర్తు చేసుకోవడానికి. టక్కున తట్టింది. 
యస్.. అనన్య. షార్ట్ ఫిల్మ్ మేకర్. ముంబై.
మంచి సందేశంతో షార్ట్ ఫిల్మ్ తీసింది. నిర్భయ గురించి. రెండు వారాల క్రితం.. యూట్యూబ్లో చూశాను.
‘జిందగీ’కి స్టోరీ చేయాలనిపించింది. ఫేస్బుక్లో వెతికి పట్టుకుని, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను. కానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాతి రోజు మెసేజ్ పెట్టాను. ఇంటర్వూ కావాలని.. ఇన్ బాక్స్ లో 
తెలియని అమ్మాయిలు వెంటనే రిప్లె ఇవ్వరు. అనుకున్నాను.. కానీ అనన్య ఇచ్చింది. 
‘థ్యాంక్యూ బాస్! మీ మెసేజ్ చూసి షాక్ అయ్యాను. అదేంటి నేను వెతుకుతున్న వ్యక్తి నాకే మెసేజ్ పెట్టారని. ఇట్స్ ఏ మిరాకిల్!’ అంది మెసేజ్లో. 
‘వాట్ నన్ను వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా ఉందే! ఎందుకు?’ టెక్ట్స్ చేశా.
‘చెప్తా. బట్ ఇప్పుడు కాదు (స్మైలీ)’ 
ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు నుంచి నా ప్రతి పోస్టుకు లైక్లు, కామెంట్లు కొడుతూనే ఉంది. 
అప్పుడప్పుడు ఛాటింగ్ చేస్తూనే ఉన్నాం. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వూ ఇస్తానంది. కానీ ఒక కండీషన్ మీద. అదేంటో ఇప్పటికీ చెప్పలేదు. తను నన్ను ఎందుకు కలుసుకోవాలనుకుంటుందో ఎంతకీ అర్థం కాలేదు. 
తన టైమ్ లైన్ లోకి వెళ్లి చాలాసార్లు చూశాను. ఫోటోస్ కూడా చూశాను.. ఒకటికి నాలుగుసార్లు. 
చాలా అందమైన అమ్మాయి. ఆల్ట్రా మోడ్రన్ గర్ల్. బోల్డ్ క్యారెక్టర్. ఓపెన్ మైండెడ్. తన ఎఫ్బీ పోస్టులు కూడా అలాగే ఉంటాయి. ఫేస్బుక్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారుగా. తన గురించి పెద్ద రీసెర్చే చేశాను. ఏదైనా యూనివర్సిటీ వారు చూసి ఉంటే గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చేవారేమో. 
రీసెర్చ్ ముచ్చట తర్వాత, తను రిప్లె గురించి ఎదురు చూస్తుందేమో ‘హే.. హాయ్ అనన్య! వెల్కమ్ టు హైదరాబాద్. ఎప్పుడొచ్చావ్?’ మెసేజ్ పెట్టా.
‘నిన్న ఈవెనింగ్. లంచ్ కి కలుద్దామా. డిన్నర్కా?’ అని వెంటనే బదులు.
అమ్మాయిలతో లంచ్ కంటే డిన్నర్ బావుంటుంది. కానీ నాకు ఆ అవకాశం కానీ, అదృష్టం కానీ లేవు. రావు. (కారణాలు అడక్కండి) అందుకే ‘లంచ్ కి’ అని స్మైలీ యాడ్ చేసి మాడిన మొఖంతో రిప్లె ఇచ్చాను. 
‘సో స్వీట్.. ఎక్కడ కలుద్దాం?’
‘నువ్వే చెప్పాలి?’- మీరూ, సారూలాంటి గౌరవవాచకాలు ఎప్పుడో పోయాయి మా మధ్య. అంత చాటింగ్ ఆల్రెడీ చేశాం. 
‘డిన్నర్కయితే నేను చెప్పేదాన్ని. లంచ్ కాబట్టి నువ్వే చెప్పాలి?’
డిన్నర్ అంటే పోయేదేమో.. అందమైన అమ్మాయితో డిన్నర్ చేసే అవకాశం పోగొట్టుకున్నాను.. అనుకుంటూ ‘సర్వీ.. నియర్ మై ఆఫీస్’ అని మెసేజ్ ఇచ్చాను. 
‘సర్వీ.. వేర్ ఈజ్ ఇట్’
‘రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్’
‘ఓకే.. ఐ విల్ సెర్చ్ ఇన్ గూగుల్. వీ ఆర్ గోయింగ్ టు మీట్ బై వన్ ఓ క్లాక్. యామ్ ఐ రైట్?’
‘హే.. యమ్మీ.. సూర్’
‘స్మైలీ’
‘స్మైలీ’
-
మొబైల్ పక్కన పెట్టి అద్దం ముందుకు వెళ్లా. నాకు నేనే కొత్తగా కనిపించా, పాత మొఖమే అయినా. సినీ తారల్ని ఇంటర్వూ చేసిన అనుభవం ఉంది. కానీ సినిమా స్టార్ లాంటి అమ్మాయితో లంచ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. అందుకే ఈ ఎగ్జయిట్మెంట్. 
పిచ్చి గడ్డం. ఎన్నడూ లేనిది ట్రిమ్మింగ్ చేసుకున్న. ప్రెష్అప్ అయ్యాక నాలుగైదు రకాల చొక్కాలు మార్చుకున్నా. 
ట్రిమ్మింగ్ చేయడం.. చొక్కాలు మార్చడం.. దువ్విన తలనే దువ్వడం.. మా ఆవిడ గమనించినట్టుంది ‘ఓర్నీ ఏశాలూ..’ అన్నట్లు ఎక్సెప్రెషన్ ఇచ్చింది. కాస్త అనుమానంగానే ఉంది ఆ చూపు. అది నాకు అవమానంగా అనిపించింది. అందుకే ఇక ఓ టీ షర్ట్ కు ఫిక్స్ అయిపోవాల్సి వచ్చింది. అది మా మార్క్ జూకెర్ బర్గ్ కు ఇష్టమైన టీషర్ట్.
సమయం పదయింది. 
ఇంకా 180 నిమిషాలు.. 10800 యుగాలు ఉంది.. తనను కలవడానికి. 
---
నేను నమస్తే తెలంగాణ దినపత్రికలో ఫీచర్స్ పేజీ ‘జిందగీ’ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాను. రేపు జిందగీలో ఫ్యాషన్ పేజీ. అందుకే ఈ రోజు పెద్దగా ఒత్తిడి ఉండదు.
‘నేను రావడానికి సమయం పట్టొచ్చు. పేజీ చూసుకోండి’ అని మా టీమ్‌కు చెప్పి బయలుదేరా. ‘సర్వీ’ దగ్గర డ్రాప్ చేయడానికి అజ్జూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు.వాడు నా తమ్ముడు. ఆఫీసులో.. బయటా.
‘నేను బయలుదేరా’ అనన్యకు మెసేజ్ పెట్టాను. అజ్జూ సర్వీ దగ్గర నన్ను దించి తిరిగి బయలుదేరాడు. అక్కడ కార్ పార్కింగ్‌కు కాస్త ప్రాబ్లమ్ ఉంటుంది. తను ఎక్కడ పార్క్ చేస్తుందో ఏమో. ముందే చెప్పాల్సి ఉండె. అయినా హైదరాబాద్‌లో అమ్మాయిలు వెహికిల్ పార్కింగ్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సి ఉండదు.
‘15 మినిట్స్’ అని అనన్య నుంచి 15 నిమిషాల క్రితం వచ్చిన మెసేజ్ చూసి ‘వెయిటింగ్ ఫర్ యు. థర్డ్ ఫ్లోర్, నంబర్ 5’ అని రిప్లయ్ ఇచ్చా.
‘లిఫ్ట్.. ఫస్ట్ ఫ్లోర్’ రిప్లయ్ వచ్చింది.
అది నా గుండె వేగం పెంచింది. నేను ఎంట్రన్స్ డోర్ వైపే చూస్తున్నా. కాస్త టెన్షన్‌గా ఉంది. ఎందుకలా ఉందో నాకే అర్థం కాలేదు. వాష్‌రూమ్‌కు వెళ్లి అద్దంలో నాకు నేను ‘కంట్రోల్’ చెప్పుకున్న.
‘కూల్ బేబీ కూల్.. 1..2.. 3..’ అని నంబర్లు లెక్కబెట్టుకుంటూ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చున్న.
తను ఈపాటికే వచ్చి కూర్చుందేమో అనుకున్న. ఇంకా రాలేదు.
ఎంట్రన్స్ వైపు చూశాను. తను అప్పుడే గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చింది. బ్లూ జీన్స్ మీద వైట్ టాప్ వేసుకుంది. మఫ్టీలో వచ్చిన దేవకన్యలా.. గాగుల్స్ పెట్టుకున్న గాంధర్వ కన్యలా ఉంది. బేరర్ డోర్ తెరిచాడు. వెధవ. నేను వచ్చేటప్పుడు పట్టించుకోలేదు. నేనే డోర్ నెట్టుకుని వచ్చా. తనతో వస్తే నన్నూ వేరేలా ట్రీట్ చేసేవాడేమో.
తను లోపలికి వచ్చి కళ్లజోడు తీసి హాల్ అంతా కలియ చూస్తున్నది. 
ఇంతలో మేనేజర్ పరుగున ఆమె దగ్గరకు వెళ్లాడు.
‘కాన్ ఐ హెల్ప్ యు మేమ్?’ అన్నాడు.
నేను అప్పటి వరకు టేబుల్ మీద చేతులు పెట్టి కూర్చున్నాను. తనని చూడగానే వెనక్కి ఆనుకున్నాను. కాలు మీదికి కాలు, చేతిలోకి మొబైల్ వాటంతట అవే వచ్చాయి. ఎవరికైనా కాల్ చేయాలనిపించింది.ఎందుకోతెలియదు. కానీ ఎవరికీ?
ప్రవీణ్ నంబర్ కనిపించింది.డయల్ చేశా.
మేనేజర్‌తో ‘టేబుల్ నంబర్ 5’ చెప్పింది అనన్య.
మేనేజర్ నా  వైపు చూపించాడు.
‘ఇడియట్. వీడేమో ఫోన్ తీయడం లేదు. లిఫ్ట్ చెయ్యరా బాబు.. తను వస్తోంది..’ అని మనసులో అనుకుంటూ అనన్య వైపు చూస్తున్నాను.

తను టేబుల్  వైపు, ఆ తర్వాత నా వైపు చూసింది. స్మైల్ ఇస్తూ.. అడుగు ముందుకు వేసింది. దాంతో పాటే ప్రవీణ్ లిఫ్ట్ చేశాడు. థ్యాంక్ గాడ్!
నేనూ స్మైల్ చేస్తూ.. ‘యా ప్రవీణ్.. ఏం జరుగుతోంది?’ అని అడిగాను.. స్మైల్ ఇవ్వడం సహజం. స్మైల్ చేయడం కృత్రిమం.
‘అన్న! పేజ్ నడుస్తుందన్న’ అన్నాడు ప్రవీణ్.
‘ఓకే.. కంటెంట్ ఏం పెడుతున్నారు’- ఈ వాక్యం చివరలో ప్రశ్నార్థకం పెట్టాలో, ఆశ్చర్యార్థకం పెట్టాలో అర్థం కాలేదు. ఆ వాక్యాన్ని అలా వాడాను. నా పరిస్థితి అలాంటిది మరి.
‘అన్నా! చెప్పినవ్ గా ఫ్యాషన్ పేజీగద.. ఏముందన్న అయిపోతది..’
అనన్య దగ్గరికి వచ్చి ‘ఏఁ.. హాయ్’ అంటూ షేక్‌హ్యాండ్ ఇచ్చింది.
నేను కనుబొమ్మలతో హాయ్ చెప్తూ లేచాను.. తను చిన్న హగ్ ఇచ్చింది..
ట్రాన్స్‌ఫార్మర్‌ని వాటేసుకున్నట్లు షాక్ కొట్టింది.
‘ప్ర...వీ...ణ్..’ పిలుపు లయ తప్పింది.
‘అ...న్న..’ వాడూ నన్ను అనుకరించే ప్రయత్నం చేశాడు.
‘ఒక్క నిమిషం’
‘అన్న’
‘గ్లాడ్ టూ మీట్ యు.. ప్లీజ్ బీ సీటెడ్’ అనన్యకు కుర్చీ చూపించా. పిచ్చి మర్యాద కాకపోతే తనకు తెలియదా.. కుర్చీ ఉందని.. కూర్చోవాలని. ‘థ్యాంక్యూ’ అంది కూర్చుంటూ.
‘ప్రవీణ్’
‘అన్న’
‘ఒక్క నిమిషం రా’
‘అన్న’...
వీడికి రచయిత ఎందుకో ఈ సన్నివేశంలో ఈ ఒక్క పదమే ఎక్కువసార్లు రాశాడు. 
‘వన్ మినిట్ ప్లీజ్’ ఫోన్ మూస్తూ అనన్యని రిక్వెస్ట్ చేశా.
‘యా షూర్’ అంది తనూ ఫోన్ తీస్తూ. తన ముంగురులు మొఖం మీదికి వచ్చాయి. కుడిచేత్తో నుదుటి మీంచి ఎడమ చెవి వెనకాలకు తోస్తూ.. నా వైపు చూసింది. తన కుడిచేతికి టర్కోసీ బ్రేస్‌లెట్ గమనించాను.
‘ప్రవీణ్!’
‘అన్న’
‘అదీ.. యా.. ఏం పెడుతున్నరు?’
‘అన్నా..’
‘అదేరా పేజ్‌లో ఏం పెడుతున్నరు’
‘తెల్సుకదన్న..ఫ్యాషన్ బొమ్మలు’ కాస్త చిరాకు పడ్డట్టు అనిపించింది.
‘ఆ. ఓకే ఓకే. నేను వచ్చే సరికి లేట్ కావొచ్చు. ఇంపార్టెంట్ పర్సన్‌తో మీటింగ్. పేజ్ జాగ్రత్తగా చూస్కోండి.. కంటెంట్, డిస్‌ప్లే, కలర్స్, బ్యాలెన్సింగ్..హెడ్డింగ్స్.. లీడ్.. అన్ని జాగ్రత్తగా చూస్కోండి’ రెండో వాక్యంలో మొదటి రెండు పదాలు నేను కాస్త గట్టిగా పలకడం తను గమనించిందో లేదో.
ప్రవీణ్ మాత్రం  ‘ఓకే అన్న’ అని ఫోన్ పెట్టేశాడు. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా.
అమ్మాయిల్ని ఇంప్రెస్ చెయ్యడానికి అబ్బాయిలు ఇలాంటి అనవసరపు బిల్డప్‌లు ఇస్తారని తెలుసు. కానీ నేనూ అలా చేస్తానని నాకే తెలియదు. సహజంగానే మగాడి హార్మోన్స్ అలా పనిచేస్తాయేమో. 
ఫోన్ పక్కన పెడుతూ ‘సారీ అనన్య.. ఎనీవే గ్లాడ్ టూ మీట్ యూ’ అన్నాను. ఎంత అమ్మాయి అయినా ఇన్నిసార్లు గ్లాడ్ టూలు అవసరం లేదేమో.
ఫోన్ హ్యాండ్‌బ్యాగ్‌లో పెడుతూ ‘నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇవ్వాళ. మిమ్మల్ని ఇలా కలవడం..’ అంది అనన్య.
ఫోన్ హ్యాండ్ బ్యాగ్ లో పెడుతూ... ‘‘నిజంగా చాలా హ్యాపీగా వుంది ఇవాళ.. మిమ్మల్ని కలవడం’’ అంది అనన్య.
మిమ్మల్ని.. ఈ పదం ఎందుకో నాకు ఇబ్బందిగా.. ఇబ్బంది కూడా కాదు.. దీనికి అటు ఇటు పదం నిఘంటువులో వెతకాలేమో? మనుషులు దగ్గరయినప్పుడు సాన్నిహిత్యం దూరం అవుతుందా? - ఈ సందేహంతోనే ‘థ్యాంక్యూ’అని చెప్పేశా. 
’ఎందుకు?’ అడిగింది ఆశ్చర్యపోతూ. 
’మిమ్మల్నీ... అన్నారుగా.. అందుకు?’ మిమ్మల్ని అనే పదం నొక్కి మరీ చెప్పాను. 
‘సారీ.. మరి నువ్వు.. అన్నారూ...’ రూ...ని చాలాసేపు సాగదీసింది. కొంచెం గ్యాప్ తీసుకున్నాక ‘సరే చెప్పు’ అంది. 
‘మీరే చెప్పాలి.. సారీ నువ్వే చెప్పాలి’
‘ఇంటర్వూ అడిగింది నువ్వు’
‘అడిగింది నేనే. కానీ కండీషన్స్ అప్లై అన్నది నువ్వు కదా. ఇంతకీ ఏంటా కండీషన్?’
‘కండీషన్ కాదు.. కంపల్సరీ.. ఇట్స్ ఏ నెసెసిటీ..’
‘తప్పనిసరియా.. ఏంటది? ల్యాగ్ అయిపోతోంది అనన్య, కొంచెం స్ట్రెయిట్గా మాట్లాడుకుందామా?’
‘ఇదిగో! నీకు స్ట్రెయిట్గానే కూర్చున్నాగా..’ తను జోక్ వేశాననుకుంది. కానీ నా ముఖకవళిక గమనించి. ‘ఓకే బాబా.. అర్థమైంది.. చెప్తాను గానీ.. ముందు ఆర్డర్ చెప్పు.. బేరర్ అప్పట్నించీ మనల్ని తినేలా చూస్తున్నాడు’ అంది. నేను పిలిచి చెప్పేలోపు.. ‘హైదరాబాద్ వస్తే బిర్యానీనే కదా.. కొత్తగా ఆర్డర్ ఇచ్చేదేముంది?’ అని తనే ఆర్డర్ ఇచ్చి.. మొదలెట్టింది. 
‘హుం.. చూడు బాస్! అసలు విషయానికి వస్తున్న. మ్యాటర్ ఏంటంటే.. నువ్వొక స్టోరీ రాయాలి. నా గురించి కాదు. నా ఫ్రెండ్ గురించి. ఇదే కండీషన్’
‘స్టోరీనా.. తప్పకుండా.. ఎవరా అమ్మాయి?’
‘అమ్మాయి కాదు.. అబ్బాయి.. కార్తీక్ రామస్వామి’
‘అబ్బాయా! అయ్యో మాది మహిళల పేజీ కదా’
‘నేను అడిగేది నీ జిందగీ పేజీలో రాసుకోవడానికి కాదు’
‘ఒక కథ. కార్తీక్ కథ. అది రాయాలి. పుస్తకంగా..’ అంది రెండు చేతుల్తో జుట్టు సర్దుకుంటూ. అప్పుడు తన మెడలో వేలాడుతున్న ఆభరణానికి రెండు పెండెంట్స్ ఉండడం గమనించాను. ఆ గొలుసు తన బ్రేస్లెట్కి మ్యాచింగ్గా ఉంది. 
‘పుస్తకమా? నేనా??’ ఊహించని పరిణామం ఎదురైనప్పుడు కలిగే ఆశ్చర్యంతో తాలూకు అనుభూతి కలిగిన అనుమానంతో అడిగా సంతూర్ మమ్మీలా. ‘నేనా.. కాలేజా?’ అన్నట్లు. 

‘అరవై ఆరేళ్ల తర్వాత ఒక ఉత్తరం తిరిగి వస్తుంది. ఒక తాత తన ప్రేయసికి రాసిన ఉత్తరం అది. ఎవరావిడ తెలుసుకునేందుకు మనవడు బయలుదేరతాడు.. ఇదీ స్టోరీ లైన్ దీన్ని ఒక నవలగా రాయాలి’
‘నవలా? ఏం మాట్లాడుతున్నావ్ తల్లీ. నేనేదో జిందగీ పేజీకి రాసుకుని బతికేటోన్ని. నాకెందుకు చెప్పు ఈ నవలలు, కథలు..’
‘అవును.. మరి. మీకెందుకు ఈ కథలు.. అపరిచితులు కదా మీరూ..’ దీర్ఘం తీసింది చివరి పదాలు. గౌరవవాచకం కూడా కలిపింది. 
‘అపరిచితులు?’ ఇది ఎక్కడో తడుతోంది. 
‘అవును అపరిచితులు.. వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా.. అపరిచితులు..’ అంది.
‘ఓ.. అదా? అది నేను రాసిన మొదటి కథ. అదొక్కటే రాశా. ఆ తర్వాత ఎప్పుడూ రాయలేదు’ అన్నా నేనేదో తప్పు చేసినట్లు. 
‘తెలుసు. మొదటి దానికే అవార్డ్ వచ్చింది కదా. యువతరం విభాగంలో. ఇంటర్నేషనల్ అవార్డ్! అందుకే కనెక్ట్ అయ్యా’ అంటూ బ్యాగ్లోంచి ఓ ఫైల్ తీసింది. తను తీస్తున్నపుడు మెడలో వేలాడుతున్న పెండెంట్స్లో ఒక దానిపై ‘ఏ, రెండో దానిపై ‘ఎన్’.. అనే ఆంగ్లాక్షరాలు గమనించా.
‘అప్పటి నుంచే నిన్ను గమనిస్తున్న. ఐదొందలకు పైగా వ్యాసాలు.. మూడొందల మంది జీవితాలు.. 140 ఎపీసోడ్లు.. మూడు స్పెషల్ కాలమ్స్.. 36 కవర్ స్టోరీలు.. ఒక కథ.. ఒక అవార్డు.. ఎన్నో రివార్డులు.. చివరగా ఒక పుస్తకం.. అదీ వర్షన్ టు పాయింట్ జీరో కూడా.. తొమ్మిదేళ్ల జర్నలిజంలో ఇదీ నువ్వు చేసింది. చూశావా నీ మీద పెద్ద రీసెర్చే చేశా కదా. ఈ ఫైల్ ఏదైనా యూనివర్సిటీ వాళ్లకు ఇస్తే నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇస్తారేమో’ అంది నవ్వుతూ. 
గౌరవ డాక్టరేట్.. ఈ డైలాగ్ నాదే. నాకు రెండు నిమిషాల నుంచి డైలాగ్ లేదని అర్థమైంది. అందుకే ‘ఎందుకు ఇదంతా?’ అని అడిగా.
‘ఒక అన్వేషణ.. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది.. న్యూటన్ మూడో సూత్రం. కార్తీక్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. దాని ప్రతిచర్యగా నజియా దొరికింది. కార్తీక్ నాకు కలిశాడు. దాని పర్యవసానం నువ్వు దొరికావ్. నేను నిన్ను కలిశాను. దాని పరిణామంగా.. ఒక పుస్తకం కావాలి’తను కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్తున్నది. 
నేను ఒక నిట్టూర్పు శ్వాస వదిలిన తర్వాత ‘చూడమ్మాయ్.. నువ్వు ఏదైనా చెప్పుగానీ. ఈ కథలు, పుస్తకాలు నా వల్ల కాదు. నేను, నా జిందగీ, నా గూగుల్ గాడు.. ఇది చాలు నా జీవితానికి..’
‘మరి ఎందుకు రాశావ్ ఆ కథ?’ నిందిస్తుందో.. నిలదీస్తోందో అర్థం కాలేదు. 

‘అదీ.. ఏదో సందర్భంలో అపార్ట్మెంట్ కల్చర్కు కనెక్ట్ అయి రాశాను. ఇప్పుడు చెప్పనా? నువ్విలా న్యూటన్ మూడో సూత్రం పట్టుకుని వస్తావని తెలిస్తే అసలు రాసేవాడ్నే కాదు. నాకంత టైమ్ ఉండదు.. తెలుసా?’
‘టైమ్.. కరెక్టే.. ఫేస్బుక్ గైడ్ అనే పనికిరాని పుస్తకం రాయడానికి కూడా టైమ్ ఉండదు.. కదా’ పెదవి విరిచింది. 
పనికిరాని పుస్తకం- తను నన్ను టెంప్ట్ చేయాలని చూస్తోంది. రెచ్చగొడితే రెచ్చిపోయే రకం కాదు నేను. విగ్రహంలాంటి నిగ్రహం.. దీనికి పర్యాయపదంగా నా పేరు రాసుకోవచ్చు. 
‘అదేం పనికిరాని పుస్తకం కాదు. యుటిలిటీ వ్యాల్యూ ఉన్న పుస్తకం’ చెప్పా మొఖం తిప్పుకుంటూ. 
‘తెలుసు. సారీ.. పనికిరాని పుస్తకం అన్నందుకు. అంతలా ఆదరణ ఉంది కాబట్టే వర్షన్ టు పాయింట్ జీరో అని కూడా వేశారుగా.. అదేదో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినట్లు..’ తను పొగుడుతోందో తిడుతోందో అర్థం కావట్లేదు.
‘అదేదో.. సరదాగా..’ నేను చెప్పబోతుండగానే.. పదాల మధ్య కామాలా దూరి ‘వర్షన్ 3.0 కూడా రాస్తావా?’ అంది. అది హేళనో, ఇంకేదో.. ప్రతిసారి ప్రాస దొరకదు మరి. 
‘ఏమో.. రాస్తానేమో.. మా బంగారం మాష్టారు అడగాలే గానీ.. ఫోరు.. ఫైవ్ కూడా రాస్తానేమో’
‘అవునా? బంగారం! మీ బంగారం.. మరి ఈ బంగారం కోసం రాయలేవా? రాయకూడదా?’ తను అమాయకంగా అడిగింది. తన మొఖం చిన్నప్పుడు ‘ఇంకో ముద్ద తిను నాన్నా’ అంటూ గోరుముద్దులు తినిపించిన మా అమ్మ మోములా కనిపించింది. 
కనిపించిందో, అనిపించిందో తెలియక నవ్వాను ముసిముసిగా. ఆ తర్వాత గట్టిగా. పట్టరాని ఆనందం తాలూకు నవ్వు అది. కానీ నేనేం ఆనందంగా లేను. పైగా ఈ అమ్మాయి నా మీద ఏదో కుట్ర పన్నుతోంది. అది తన నవ్వులో కూడా కనిపిస్తున్నది. 
బేరర్ బిర్యానీ తెచ్చాడు. మధ్య మధ్యలో వచ్చి ఓసారి గ్లాసులు, ఇంకో సారి ప్లేటు.. మరోసారి ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలు పెట్టి వెళ్లాడు. బిర్యానీ వడ్డిస్తున్నప్పుడు అనన్య ఫైల్ తన ఎడమ వైపు కుర్చీలో పెట్టింది. దాన్ని ఎవడైనా ఎత్తుకెళ్లి పోతే బాగుండు అనిపించింది. 
‘మనం తింటూ కూడా మాట్లాడుకోవచ్చు’ అంది నేను మౌనంగా రెండు ముద్దలు తిన్న తర్వాత.
నేను తన వైపు చూసి స్మైల్ చేశాను. 
తను ఒక సిప్ మంచినీళ్లు తాగి గ్లాస్ పక్కన పెడుతూ ‘ఒక విషయం చెప్పనా?’ అంది. 
‘చెప్పు’ అన్నట్లు తల ఊపి తనవైపు చూశాక గ్లాస్ వైపు చూశాను. తన లిప్ స్టిక్ కాస్త దాని అంచున అంటుకుంది. 
‘నీ బ్లాగ్, ఫేస్బుక్, గతంలో రాసిన ఆర్టికల్స్.. అన్నీ చదివాను. వాటి నుంచే ఈ కథ రాయడానికి నువ్వే కరెక్ట్ అనిపించింది’ మళ్లీ మొదలెట్టింది. 
‘నేనే ఎందుకు? కథలు, నవలలు రాసేవారు వేరే ఉన్నారుగా, చాలామంది. చాలా గొప్ప రచయితలు..’
‘ఉన్నారు. లేరని నేనట్లేదు. కానీ సంతూరు సబ్బు కోసం పొరుగూరు వెళ్లం కదా మనం. జర్నలిస్టులు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను నిన్నే ఎందుకు అడుగుతున్నాను?’
‘అవును ఎందుకు అడుగుతున్నావ్?’ సంతూరు, పొరుగూరు అదేంటో అర్థం కాక అడిగాను.

కుర్చీలోంచి ఫైల్ తీసి మీద పెట్టింది. ఎడమ చేతితో దాంట్లోని ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ.. ‘ఫీనిక్స్ జ్యోతి.. ఈమె గురించి చాలామంది చాలాసార్లు రాసి ఉండొచ్చు. కానీ నువ్వు రాసిందే రీప్రింట్ ఎందుకు వేశారు. పది వేల కాపీలు.. అంతకు ముందు సాక్షిలో కూడా రాశారు కదా.. వాళ్లనెందుకు ఆడగలేదంటావ్ ఆ వందేమాతరం పౌండేషన్ వాళ్లు’ 
వందేమాతరం ఫౌండేషన్, రీప్రింట్.. ఈ విషయాలు తనకెలా తెలుసో అర్థం కాలేదు. అవి కాన్ఫిడెన్షియల్ కదా? ఇక్కడ సందేహం తీర్చుకోవడం కంటే ముందు సమాధానం ఇవ్వాల్సి ఉంది. పరిస్థితి అలాంటిది. అందుకే ‘అది వేరు.. అది ఫీచర్స్ స్టోరీ. కావాలంటే కార్తీక్ కథతో ఆలాంటి ఫీచర్ స్టోరీ చేస్తా’
‘రాస్తావ్. మీ పేపర్లో. బట్.. టుడేస్ న్యూస్పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. నువ్వు నీ ఫీచర్ చూస్తున్నావ్. నేను ఫ్యూచర్ చూస్తున్న’
వేస్ట్ పేపర్ అనడం ఎక్కడో తగిలింది. హర్ట్ అయ్యా. నా నోట మాట రాలేదు. నోట్లోకి బిర్యానీ కూడా వెళ్లడం లేదు. 
‘చూడు నాగ్. ఎవ్రీ లవ్ స్టోరీ ఈజ్ బ్యూటీఫుల్, బట్ అవర్స్ ఈజ్ మై ఫేవరెట్. చాలా ప్రేమకథలుంటాయి ఈ ప్రపంచంలో. కానీ అది మనదైనప్పుడు.. మనవాళ్లదైనప్పుడు ఆ కిక్కు.. థ్రిల్లు.. ఆ ఫీలింగే వేరు. చాలా గొప్పగా ఉంటుంది. ఇదీ అలాంటి కథే. ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగ్గ పోరాటం.. తెలంగాణ సాయుధ పోరాటం.. అలాంటి ఉద్యమ నేపథ్యమున్న ప్రేమకథ మరుగున పడిపోకూడదు. నువ్వు ఫీచర్ రాయి. కాదనను. కానీ ప్రతి ఏడాది వాలైంటెన్స్ డే రోజు పబ్లిష్ చేసే ప్రేమకథల్లో ఒకటిగా ఇది మిగిలిపోకూడదు.. ఒక పుస్తకంగా.. వీలైతే.. ఓ సినిమాగా.. రావాలి. అదీ నా తపన’
‘పుస్తకం.. సినిమా? రాయొచ్చు కానీ.. ’ తను బిర్యానీ కంటే వేగంగా నన్నే తింటోంది.. నా మాట పూర్తి కాకుండానే మళ్లీ మొదలెట్టింది. ఫైల్ చూపిస్తూ.. 
‘ఇదిగో ఇక్కడ చూడు.. ఇక్కడి వాళ్లు ఎందుకు రాయడం లేదో. రాసిన కథని ముట్టుకోకుండా.. వంద.. వంద కథలు రాసుకోవచ్చు అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఎస్ఎస్ రాజమౌళి వాళ్ల డాడీ.. ఇది చదివినప్పుడు నీకేం అనిపించలేదా నాగ్? ఈ ఇంటర్వూ మీ జిందగీలోనిదేగా?’ తను తినడం ఆపి చాలా సేపైంది. ప్రతి దానికి ఫైల్లో ఓ ప్రూఫ్ చూపిస్తోంది. సమాధానం ఇవ్వడం తప్ప వాదనకి నాకు అవకాశం లేదని, అవసరం రాదని అర్థమవుతోంది.. 
‘అనిపించింది. కానీ కథ రాయడానికి.. చాలా ఉండాలి. సబ్జెక్టుతో కనెక్ట్ అవ్వాలి. అందుకు బాడీలో ఓ ఎలిమెంట్ ఉండాలి. అది బల్బులో ఫిలమెంట్ లాంటిది. ఫిలమెంట్ ఉంటేనే బల్బు వెలుగుతుంది. ఎలిమెంట్ ఉంటనే కథ బావుంటుంది’
‘అంటే.. నాకర్థం కాలేదు’ తను మళ్లీ తినడం మొదలెట్టింది. బిర్యానే. 
‘ఐ మీన్.. నువ్వు చెప్పే కథ.. ఈ పోరాటాలు.. ఉద్యమాలు.. గతం.. చరిత్ర.. ఇవన్నీ యాంటిక్ సబ్జెక్ట్స్.. ఓ ఆరవై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. నేను కాంటెంపరరీకే ఎక్కువ కనెక్ట్ అవుతా. సింపుల్గా చెప్పాలంటే.. నేను యాంటికిటీ ఫుల్ బాటిల్కు కనెక్ట్ అయినంతగా.. ఈ యాంటికిటీకి అవ్వలేను. 
‘అంటే రాయడం ఇష్టమే.. కానీ ఈ సబ్జెక్ట్ రాయడం ఇష్టం లేదన్నమాట..’
‘నాట్ లైక్ దట్..! మేబీ.. ఇంచు మించు అంతే’
‘లేదు.. నువ్వు కనెక్ట్ అవుతావ్’
‘ఎలా చెప్పగలవ్..?’ 
‘చెప్తా చెప్తా’ తను ఫింగర్ బౌల్ కోసం ఎదురు చూస్తూ.. ‘అయ్యావ్.. రాశావ్ కూడా.. రాణీ రుద్రమ నుంచి.. వీరనారి సిరీస్. అంతకుముందు వాహ్ హైదరాబాద్.. ప్యారానా పూల్.. ముచ్కుందా.. ఆపరేషన్ సెప్టెంబర్ 17.. ఇలా చాలా ఉన్నాయ్. ఇంతకు మించి ఏం చెప్పాలి? అందుకే నువ్వు చెప్పే సోకాల్డ్ ఎలిమెంట్ నీలో ఉందని అంటున్నాను..
ఫింగర్ బౌల్లో చేయి పెడుతూ ‘సోకాల్డ్?’ అన్న కాస్త గట్టిగానే.
‘కనెక్ట్ అవుతావని ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా?’ అంది తను టిష్యూ తీసుకుంటూ.
ముందు ఇష్యూ క్లోజ్ అవ్వాలని.. ‘ఓకే.. తప్పకుండా’ అన్నాను.
‘ప్రామిస్..?’ అంది చేయి చాస్తూ.
‘ఈ ప్రామిస్లు ఎందుకుగానీ.. చెప్పు’ - ఏం ప్రూఫ్ తెచ్చిందో ఏంటో ఈ మహంకాళమ్మ.
‘మనం ఇక్కడికొచ్చి ఆఫెన్ హవర్ అయింది. ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడు.. చెయిర్స్.. గ్లాసెస్, బౌల్స్, ప్లేట్స్.. ఇన్ని ఉన్నాయ్ కదా. ఇక్కడ బ్యూటీఫుల్ ఫ్లవర్ వాజ్ ఉంది. అక్కడ చూడు సాలిడ్ డిజిటల్ క్లాక్ ఉంది.. కానీ నువ్వు అప్పటి నుంచి ఆ మూలనున్న ఆ హుక్కానే.. ఎందుకు చూస్తున్నావ్.. 30 నిమిషాల్లో 49 సార్లు.. ?
‘ఆశ్చర్యం.. అంతకు మించి ఇంకేదో! 49 సార్లు నిజమో కాదో తెలియదు. కానీ, నేను నిజంగానే దాన్ని చూస్తున్నాను. ఈ విషయం పైకి చెప్పలేకపోయినా, లోపల అర్థమవుతోంది. నిజమే.. అనన్య తర్వాత ఇక్కడ నన్ను ఆకట్టుకున్నది.. అదే. బాల్యమిత్రుడు బార్లో కలిసినట్లు.. ఏదో గొప్ప ఫీలింగ్. మళ్లీ హుక్కా వైపు చూశాను. తన లెక్క ప్రకారం 50వ సారి. అంతకంటే ఎక్కువసార్లు తనని చూశానని తను గమనించలేదా?
ఒక కన్ఫ్యూజన్.
మనుషుల్ని కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయాలి.
తను నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు కన్ఫ్యూజ్ చేసేసింది. దాని నుంచి ఓ క్లారిఫికేషన్ వచ్చింది. కనెక్ట్ అయ్యాను.
తననే చూస్తున్నాను. కళ్లలోకి సూటిగా.
తనూ అలానే చూస్తూ ‘చెప్పు’ అంది.
ఏం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియక చూపుతిప్పుకున్న. తల తిప్పుతున్నప్పుడు నా చూపు తన పెండెంట్స్ మీద పడ్డాయి. ‘యా.. ఇందాకటి నుంచి అడుగుదామనుకుంటున్నాను.. ఆ రెండు పెండెంట్స్లో.. ఏ ఫర్ అనన్య కావొచ్చు.. మరి ఎన్ అంటే..?’ అడిగాను కొత్త అనుభూతిలో విహరిస్తూ.
‘ఎన్ ఫర్.. ఎన్ ఫర్.. నగేష్ బీరెడ్డి..’ అంది. ‘హ హ హా..’ అని నవ్వింది.
‘ఎందుకా నవ్వు’ అని అడగాలన్న ప్రశ్న నాలో ఉదయించేలోపు పెండెంట్ తీస్తూ.. ‘కాదు.. ఎన్ ఫర్ నజియా.. కార్తీక్ రామస్వామి అన్వేషణ.. ఈ నజియా కోసమే.. ఇప్పటి వరకు ఈ బరువు నా మీద ఉండె.. ఇప్పుడు ఆ బాధ్యత నీ చేతిలో పెడుతున్నా’ అంటూ నా కుడిచేయి లాగి అరచేతిలో పెట్టింది. ‘చెప్పు. ఎలిమెంట్ దొరికిందా?’ అంది.. నా చేయి మూసి తన చేతితో కప్పుతూ.
తను భారం దించుకుంది. నా మనసు బరువెక్కింది. 

‘చెప్పనా?’ తన చేయిపై నా ఎడమ చేతిని వేసి.. తన కళ్లలోకి చూస్తూ ‘ఆభరణాల్ని అవయవాలుగా భావించే ఆడవారు.. అవి మనకు ఇస్తున్నప్పుడు కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా?’ అని అడిగాను.
‘ఇలాగే ఉంటుంది. చాలా గొప్ప అనుభూతి ఇది. తల్లి చనుబాలు.. భార్య మురిపాలు.. వేర్వేరు. కానీ దేనికదే ప్రత్యేకం. ఇదీ అలాంటి మరో ప్రత్యేక సందర్భం’ తన మౌనంగా మాట్లాడుతోంది కళ్లతో. తన మనుసు నుంచి ఈ మాటలు నా గుండెకు చేరాయి. చేతుల మీదగా. మధ్యలో నజియా ఉంది. తన కోసం మా ఈ చారిత్రక భేటీని అరచేతుల మధ్య చీకట్లోంచి చూస్తున్నది.
‘కార్తీక్ రామస్వామిని ఎప్పుడు పరిచయం చేస్తున్నావ్?’
‘చేస్తా.. థ్యాంక్యూ నాగ్. నేను నమ్మాను. నువ్వు రాస్తావని. నేను రాయించగలనని. ఆ హుక్కా వెలిగిస్తే కిక్కొస్తది.. నిన్ను రగిలిస్తే బుక్కొస్తది.. తెలుసు నాకు.. ’ తను నవ్వింది.. హుక్కా వైపు.. నావైపు చూస్తూ. ఇద్దరిది ఇంచుమించు ఒకే నవ్వు.
సుఖాంతంగా ముగిసే సినిమాలో శుభం కార్డు పడే ముందు నటీనటులంతా కలిసి నవ్వుతున్నట్లు ఉంది మా నవ్వు.
-
రింగుల జుట్టు, మాసిన గడ్డం, బోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు, ఖద్దరు కుర్తాలో చాలా సాదాసీదాగా ఉన్న కార్తీక్ రామస్వామిని కలిశాను. ముంబైకి చెందిన ఒక కోటీశ్వరుడి కొడుకంటే నమ్మలేదు నేను. తన కథ చెప్పాక నమ్మక తప్పలేదు. నజియా కోసం తన అన్వేషణను ఇక తనే మీకు చెబుతాడు. కార్తీక్ చెప్పే కథ పక్క పేజీలో మొదలవుతుంది. తనతో కలిసి మీరూ ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు.