Skip to main content

గజానన్స్‌ ఖజానా

పది రూపాయల బిళ్ల కనిపిస్తే పదిలంగా దాచిపెట్టుకుంటాం. ఐదు రూపాయల బిళ్లలే తప్ప నోట్లు కనిపించడం లేదని ఎవరైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని పర్సులో పెట్టుకుని మురిసిపోతాం. ఇలాంటివి ఓ నాలుగైదు మన దగ్గరుంటే నలుగురికి చెప్పుకుని గర్వపడతాం. ఆ మాత్రం దానికే అంతలా ఫీలయిపోతే మరి ఈ గజానన్‌ ఎంతలా గర్వపడాలి. ఎందుకంటారా? గజానన్స్‌ ఖజానాలో అలాంటి అరుదైన నాణేలు, నోట్లు చాలా ఉన్నాయి మరి.

పదహారణాల తెలుగమ్మాయి అనడం వినే ఉంటారు. కానీ అణాని ఎక్కడైనా చూశారా? నిజాం కాలం నాటి నాణేలు మ్యూజియంలో కాకుండా బయట ఎప్పుడైనా కనిపించాయా? ఏ దేశం కరెన్సీ నోటు అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది? కలర్‌ఫుల్‌గా ఉండేది ఏ దేశం కరెన్సీ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు గజానన్‌ దగ్గర సమాధానం దొరుకుతుంది.  అతని దగ్గర 195 దేశాల అరుదైన నోట్లు, 220 దేశాల నాణేలు ఉన్నాయి. ఒక్కో నోటుకు ఒక్కో కథ ఉంటుంది. ఒక్కో నాణేం వెనుక ఒక్కో చరిత్ర ఉంది. వాటిని చూపిస్తూ ఆనందంతో గజానన్‌ చెబుతుంటే చిన్నప్పుడు చరిత్ర పాఠాలు చెప్పిన సోషల్‌ టీచర్‌ గుర్తొస్తాడు.

ఎప్పట్నించి?
గజానన్‌ నాన్న రఘు మహబూబ్‌నగర్‌లో డాక్టర్‌. వారి ఆస్ప్రతి పక్కనే వాళ్లకు ఒక మెడికల్‌ షాపు ఉండేది. గజానన్‌ ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌ నుంచి వచ్చాక మెడికల్‌ షాపులో కూర్చునేవాడు. గల్ల పెట్టెలో ఉండే చిల్లరని లెక్కపెడుతూ ఆడుకుంటుండేవాడు. ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లలు చాలా ఉండేవి. కానీ అన్నీ ఒకలా ఉండేవి కావు. ఎందుకలా? అతనిలో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన నుంచే పుట్టింది ఒక హాబీ. అదే నాణేలను సేకరించడం. పదో తరగతి పూర్తయ్యేసరికి అది అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. అతని స్నేహితులు, బంధువులు అందరికీ అతని హబీ గురించి తెలిసిపోయింది. ఎవరికి ఏ అరుదైన నాణెం, నోటు కనిపించినా వెంటనే గజానన్‌కు పంపించేవారు. గజానన్‌ బంధువులు, వాళ్ల నాన్న స్నేహితులు చాలామంది విదేశాల్లో ఉన్నారు. వారు కూడా అక్కడి కరెన్సీని పంపించేవారు. అలా 2006లో ఇంజనీరింగ్‌లో చేరేసరికి 50 రకాల నోట్లు, మరో 50 అరుదైన నాణేలు అతని సొంతమయ్యాయి.

విదేశాలకు వెళ్లి...
హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు ఇంటర్‌నెట్‌లో వెతికి చాలా రకాల కాయిన్స్‌ గురించి తెలుసుకునేవాడు. నాణేలు సేకరించే అలవాటు ఉన్న వ్యక్తులను కలిసి సలహాలు తీసుకునేవాడు. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక ఎం.ఎస్‌. చేయడానికి న్యూజిలాండ్‌ వెళ్లాడు. పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ ఆ డబ్బును కాయిన్స్‌ కలెక్షన్‌కు వినియోగించేవాడు. చదువు పూర్తయ్యాక ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, మలేషియా దేశాలు తిరిగి చాలా నాణేలు, నోట్లు సేకరించాడు. కొన్ని వేలం పాటలో కొన్నాడు. కానీ అవి తర్వాత నకిలీవి అని తెలిశాక ఎంతో బాధపడ్డాడు. మొత్తానికి పదేళ్లు కష్టపడి 195 దేశాల నోట్లను, చిన్న చిన్న దేశాలతో కలిపి 220 దేశాల నాణేలను సేకరించాడు. అందుకు అతనికి అయిన మొత్తం ఖర్చు ఎనిమిది లక్షల రూపాయలు. వాటి మొత్తం బరువు 32 కిలోలు. వాటన్నింటిని 2010 ఆగస్టులో హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్‌కు పెట్టాడు. మంచి స్పందన లభించింది. అప్పుడే అతనికి బాగా అర్థమైంది తాను సంపాదించినవి ఎంత అరుదైనవో.

స్పెషల్స్‌
గజానన్‌ సేకరించిన నోట్లు, నాణేలలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో వాడిన నోట్లు, జింబాబ్వే వారి ఒన్‌ హండ్రెడ్‌ ట్రిలియన్‌ డాలర్‌ నోటు, మిలీనియమ్‌ ప్రత్యేక నోటు, మన దేశంలో పోర్చుగీసు, ఈస్ట్‌ ఇండియా కంపెనీల కాలంలో చలామణిలో ఉన్న నోట్లు, వినాయకుని బొమ్మ ఉండే ఇండోనేషియా నోటు, కలర్‌ఫుల్‌గా ఉండే స్విట్జర్లాండ్‌ నోటు, ఏడో నిజాం కాలంలో వాడిన నోట్లు తన దగ్గర ఉన్న నోట్లలో అపురూపమైనవని చెప్పాడు గజానన్‌. మాల్వా, ఔరంగజేబ్‌, రాజరాజ చోళ, టిప్పు సుల్తాన్‌, అక్బర్‌, హిట్లర్‌ల కాలంలో చలామణిలో ఉన్న వెండి, రాగి నాణేలు హైదరాబాద్‌ సంస్థానంలోని వెండి నాణేలు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన 50, 100 రూపాయల నాణేలు కూడా అతని దగ్గర ఉన్నాయి.

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో 150 దేశాల నాణేలు సేకరించనతనిదే రికార్డుగా ఉండేది. ఆ రికార్డుని గజానన్‌ ఎప్పుడో బ్రేక్‌ చేశాడు. లిమ్కాకు దరఖాస్తు చేసుకోకపోయినా మరో ఐదు దేశాల నోట్లు సంపాదించి ఏకంగా గిన్నిస్‌ రికార్డునే కొట్టాలని చూస్తున్నాడు గజానన్‌. ఇవన్నీ చేస్తూ కూడా గజానన్‌ హైదరాబాద్‌ వెస్ట్‌ మారెడ్‌పల్లిలోని లెరా టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...