Skip to main content

రాజు నిన్ను మర్చిపోలేక పోతున్నాం..

2010
మార్చి 16
రాత్రి పదిగంటలు...
ఎంఎన్‌జె క్యాన్సర్‌ హాస్పిటల్‌ ...
మెయిన్‌ గేటుకు ఎడమవైపు మూలన చిన్న గుడి ఉంది. అమ్మ వారి ముందు దీపం వెలుగుతోంది. దీపం పక్కనే నాలుగు అగరుబత్తీలు కాలుతున్నాయి. వాటినెవరో అరటిపండుపై గుచ్చారు. పసుపూ, కుంకుమా చల్లారు.
గుడి పక్కన ఓ పది పదిహేను బైకులు పార్క్‌ చేసి ఉన్నాయి.
"నాలుగైదుసార్లు బయటికి వెళ్తుంటాం. వస్తుంటాం. వెళ్లొచ్చిన ప్రతిసారీ ఐదు రూపాయలివ్వాలా?'' అంటూ పార్కింగ్‌ టోకెన్‌ అడిగిన కుర్రాడితో గొడవ పడుతున్నాడో పెద్దాయన.
పార్కింగ్‌ వెనకాల వరండా. ఆ వరండాలో ముగ్గురు పడుకున్నారు. ఇద్దరు కూర్చున్నారు. పడుకున్న వారిలో ఇద్దరికి దుప్పట్లు కూడా లేవు. నేల మీదే పడుకున్నారు. ఒకావిడ స్తంభానికి ఆనుకుని కూర్చుంది. ఆమె ఒళ్లో ఓ చిన్నారి పడుకుంది. కాళ్లు ముడుచుకుని పడుకున్న ఆ పాపని జో కొడుతోంది ఆ తల్లి. చంటిది హాయిగా నిద్రపోతోంది. ఆ అమ్మ మాత్రం శూన్యంలోకి దీనంగా చూస్తోంది.
కుడివైపు ప్రహరి వెంబడి ఆంబులెన్స్‌ ఆగిఉంది. ఆంబులెన్స్‌కు, గోడకి మధ్య సందులో ఒకాయన బీడీ కాలుస్తున్నాడు.
ఆంబులెన్స్‌ దాటాకా గోడ పక్కన ఇద్దరు కూర్చున్నారు. అందులో మాసిన గడ్డం ఉన్న వ్యక్తి అన్నం పొట్లాం విప్పి తింటున్నాడు. ప్లేటు కూడా లేదు. ఆ కాగితంలోనే అన్నం కలుపుతున్నాడు. రెండో వ్యక్తి ప్యాకెట్‌కు ఉన్న దారం విప్పి సాంబార్‌ పోస్తున్నాడు.
వాళ్ల తర్వాత ఓ సిమెంటు దిమ్మె ఉంది. నల్ల చొక్కా వేసుకున్న కుర్రాడు తలపట్టుకుని దిమ్మెపై కూర్చున్నాడు. గీతల చొక్కా వేసుకున్న ఇంకో అబ్బాయి అతని భుజం మీద చేయి వేశాడు. అవతలి పక్కన కూర్చున్న మూడో కుర్రాడు వారిద్దరికి ఏదో చెబుతున్నాడు. ఓదార్చుతున్నట్లుగా అతని హావభావాలున్నాయి.
ఎదురుగా మెయిన్‌ ఎంట్రన్స్‌... లోపలి నుంచి నలుగురు వస్తున్నారు. నా వెనకాల ఒకావిడ ఏడుస్తూ.. వడి వడిగా అడుగులు వేస్తోంది. నన్ను దాటేసి లోపలికి వెళ్లిపోయింది. ఎంట్రన్స్‌ దగ్గర సెక్యూరిటీ గార్డు ఫైబర్‌ చెయిర్‌లో కూర్చుని ఉన్నాడు. చెయిర్‌కి ఆనించి ఒక లాఠీ ఉంది. అతని విజిల్‌ కుర్చీ కింది నుంచి వేలాడుతోంది.
రిసెప్షన్‌లో అమ్మాయి అప్పుడే స్నానం చేసి వచ్చినంత ఫ్రెష్‌గా కనిపిస్తోంది. "మేడమ్‌ గారు లేరు, ఓ గంటలో వస్తారు'' అని ఫోన్‌లో ఎవరికో చెబుతోంది.
ఎంట్రన్స్‌ దాటి ఎడమ వైపు తిరగ్గానే దూరంగా ఏవో ఏడుపులు... "ఓ కొడుకో.. నా కొడుకో..'' అంటూ ఒకావిడ ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది. ఆ ఏడుపులో ఎక్కిళ్లు.. బహుశా రాజు వాళ్ల అమ్మ అనుకుంటా.
రాజుని ఇలా చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు వాడిని చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మూడేళ్లయ్యింది వాడి మోహం చూసి. "జీవితంలో నీ మోహం నాకు ఇక చూపించకు'' అని నేనే కదా వాణ్ణి ఇంట్లోంచి గెంటేశాను. అలాంటిది నేనే ఈ రోజు వాణ్ణి చూడాల్సి వస్తున్నందుకు నాకెందుకో బాధగా కూడా లేదు. కానీ కొంచెం భయంగా ఉంది. నిజం చెప్పన ఎవరికీ చెప్పలేనంత బాధగా కూడా ఉంది మనసులో.
రాజుకు నేనంటే ఇష్టం. చచ్చేంత ఇష్టం. ఎదుటివాణ్ని చంపేంత ఇష్టం. కాలేజ్‌లో నాపై చేయి వేసినందుకే క దా, వేసినవాడి చేయి విరిచేసి జైలు వరకు వాడు వెళ్లి వచ్చింది. నా కోసమే వాడు అలా చేసింది. అది నాకు తె లుసు. కానీ నాకు వాడంటే కోపం. రాజంటే పగ. మంట. వాడి పేరు వినిపిస్తే కింది నుంచి పైకి ఒళ్లంతా తేళ్లు పాకినట్లుగా ఉంటుంది. అయినా పర్లేదు. వాణ్ని చూడాలి. చివరి సారి. ఎందుకంటే మళ్లీ ఇక చూడలేను.
ఆ వరండాలో కుడిపక్కన పదిపదిహేను మంది నిల్చుని ఉన్నారు. ఎడమ పక్కన ఐదుగురు ఆడాళ్లు కూర్చున్నారు. నాలుగో ఆవిడ రాజు వాళ్ల అమ్మ. జుత్తు చెదిరిపోయి ఉంది. కళ్లు లోపలికి వెళ్లయి. కాళ్లు చాపుకుంది. ఏడుస్తోంది ఆమే.
"నాకొడుకు నామీద అలిగిండమ్మో... యయ్‌హు..
ఎంత పిలిచినా లేస్తలేడమ్మో... యయ్‌హు..
నాకింకెవరూ లేరండమ్మో... యయ్‌హు..
నా పెండ్లాన్ని మంచిగ సూస్కొమ్మండు.. యయ్‌హు..'' - నన్ను చూసి ఏడుపు ఆపింది.
"వచ్చివనా కొడుకో.. నువ్వెస్తవో రావో అనుకున్నం. యయ్‌హు..'' ఇంకా గట్టిగా ఏడుపు మొదలుబెట్టింది.
నా అడుగులు వేగంగా కదిలాయి. నాకే తెలియకుండా ఆమె ఒళ్లో తలపెట్టి మోకాళ్లపై కూర్చున్నాను. ఆమె నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది.
నా ఏడుపాగలేదు. అయినా ప్రయత్నించాను. కన్నీళ్లు ఆగిపోయాయనుకున్నాను.
"పొద్దుగూగాల కాంచి ఏడుస్తుంటివి. ఇగ ఊకేరాదే. ఏడ్చేచ్చి నువ్వు కూడా సస్తవే ఏంది?'' ఎవరో పెద్దావిడ ఆమెని ఓదారుస్తూ నా చేయి పట్టుకుని పైకి లేపింది. ఎవరో అబ్బాయి వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్లాడు. నా కన్నీళ్లు ఎప్పుడో కట్టలు తెంచుకున్నాయని తెలియలేదు. ఆ నీళ్లలోంచి మసకలో అతనెవరో కనిపించలేదు. కన్నీళ్లు తుడుచుకుని మూడడుగులు ముందుకు కదిలాను. అతనెవరో నా చేయి పట్టుకుని తీసుకెళుతున్నాడు. కళ్లు తెరిచి చూశాను.
"అసలెప్పుడు జరిగింది?'' అడిగాను. 
"ఎనిమిదింటికి. అప్పుడు నేనిక్కడే ఉన్నా. ఫస్ట్‌ నీకే ఫోన్‌ చేద్దామనుకున్నా. కానీ గంట వరకు నేనే ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయా.
నేను కుర్చీలోంచి లేచి నిరంజన్‌ చేయి పట్టుకున్నా.
నిరంజన్‌ లేచి నాతో పాటే కదిలాడు. ఆ వార్డు తలుపుపై పురుషుల వార్డు అని రాసి ఉంది. లోపలికి వెళ్లాక ఓ నలభై పడగలున్నాయి. ఒక పేషంటు దగ్గర ఒకరు. ఇంకో పేషంటు దగ్గర ఇద్దరు, మరికొంత మంది పేషంట్ల దగ్గర ముగ్గురు నలుగురు ఉన్నారు. ఎడమవైపు టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ వస్తోంది. ఒక నర్సు కాలుపై కాలువేసుకుని మ్యాచ్‌ చూస్తోంది. ఇంకో నర్సు ప్యాడ్‌ పట్టుకుని ఏదో రాసుకుంటోంది. నిరంజన్‌ నా చేయి పట్టుకుని కుడివైపు తీసుకెళుతున్నాడు. మేం వెళుతున్న దారికి ఇరువైపులా పడగలున్నాయి. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. దాదాపు చివరి పడగ వద్ద చాలామంది గుమి కూడా ఉన్నారు. సెక్యూరిటీ అతను కొందరిని 'చూసి వెళ్లిపోండి' అని బతిమాలుతున్నాడు. ఆ గుంపుని తోసుకుంటూ నిరంజన్‌ నన్ను తీసుకెళ్లాడు.
నన్ను మంచంవైపు నె ట్టి వాడు తల తిప్పుకుని దూరంగా వెళ్లి నిల్చున్నాడు.
నేను బలవంతంగా మంచం వైపు చూశాను..
రాజు పడుకుని ఉన్నాడు.. గాడ నిద్రలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.. నుదుట కుంకుమ బొట్టు. మొహం వరకు దుప్పటి కప్పి ఉంది. ఒత్తుగా ఉండే వాడి జుట్టంతా ఉడి పోయి ఉంది.
రాజుని అలా చూడలేక పోయాను.
కన్నీళ్ళు ఆగడం లేదు..
.....
....
క్షమించండి.. కీ బోర్డు మీద వెళ్ళు కదలడం లేదు. 
(రాజు చనిపోయి ఏడాది గడిచింది. ఆ రోజు ఆస్పత్రిలో చుసిన దృశ్యాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి)
 






Comments

sorry andi chadivaaka manasu baadha gaa aindi

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...