Skip to main content

ఈ చెట్టు ఊరికిపోయింది తెల్సా!


ఈ చెట్టు ఊరికిపోయింది తెలుసా? మొన్నటి వరకు ఇది చౌటుప్పల్‌ దగ్గర ఉండేది. ఇప్పుడు చిట్యాలకు వెళ్తుంటే రైల్వే బ్రిడ్జీ దగ్గర కుడివైపు ఉంటోంది. చెట్టు ఊరికి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా? చెట్లకు చక్రాలుంటే ఈ సమస్య వచ్చేది కాదేమో. రోడ్ల వెడల్పు పెంచినప్పుడల్లా ఎంచక్కా అవి అవతలివైపు కెళ్లి నిలబడి ఉండేవి. చక్రాలు లేవు కదా చక్రాలున్న వాహనాలు హాయిగా తిరగడం కోసం వాటిని నిలువునా నరికి చంపడమూ న్యాయం కాదు. అందుకే ఈ మధ్య వాటిని సగం సరికి మరోచోట పాతి సగమూ బతికేలా చేస్తున్నారు. ఎవరో కోర్టుకెళ్లి ఆర్డరు తెచ్చుకునేదాకా ఆగకుండా ప్రతి రోడ్డు విస్తరణలోనూ ఈ పద్ధతిని భాగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా దేని గురించి అంటారా? తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ గురించి. రోడ్డుకు ఇరువైపునున్న తొమ్మిది వేల చెట్లలో కేవలం 36 చెట్లని మాత్రమే తీసి వేరే చోట నాటారు. బతికాయా? ఎలా ఉన్నాయి అంటారా? మీరే చదవండి. 



శోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించెను. పాదచారులు ఆ చెట్ల నీడలో సేదతీరెడివారు- అని చిన్నప్పుడు బట్టీ పట్టిన పాఠం మళ్లీ మళ్లీ గుర్తుకొస్తుంది తొమ్మిదో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు చూస్తున్నప్పుడు. మన రాష్ట్రంలో ఎన్‌హెచ్‌9 పొడవు 430 కిలోమీటర్లు. నల్గొండ జిల్లా దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ వరకు 181 కిలోమీటర్ల మేర రోడ్డుని ఇప్పుడు వెడల్పు చేస్తున్నారు. అయితే మనం మాట్లాడుకుంటున్నది రోడ్డు వెడల్పు గురించి కాదు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల గురించి కదా. అశోకుడులాంటి మహానుభావులు ఎవరు నాటారో తెలియదు కాని విస్తరణ పుణ్యమా అని ఇప్పుడు ఆ చెట్లన్నింటిని నిరికివేశారు. నరికివేయకుండా రోడ్డుని ఎలా వెడల్పు చేస్తారు మరి? అని మీరు అడగొచ్చు. కరెక్టే. కాదనలేం. కానీ అంతంత పెద్ద చెట్లని నరికేస్తుంటే ఏదో బాధ.

కోర్టు స్టే..
నిత్యం రద్దీగా ఉండే ఎన్‌హెచ్‌9ని ఫోర్‌ లేన్‌గా చేయాలని నేషనల్‌ హైవే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ మూడోదశ కింద ఫిబ్రవరిలో టెండర్లు పిలిచింది ప్రభుత్వం. సుమారు రెండు వేల కోట్ల ఈ ప్రాజెక్టుని జిఎమ్‌ఆర్‌ సంస్థ చేజిక్కించుకుంది. మార్చి 21న నార్కెట్‌పల్లిలో కేంద్రమంత్రి ఆర్‌పిసింగ్‌ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు శరవేగంగా మొదలయ్యాయి. కాని రోడ్డుకు ఇరువైపులా ఒకటా రెండా? సుమారు తొమ్మిది వేల చెట్లున్నాయి. మరి వీటిని ఏం చేయాలి? ఈ చెట్లన్నింటిని రక్షించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సేవ్‌(సోసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఫిబ్రవరిలోనే హైకోర్టులో కేసు వేసింది. ఇలాంటి పిటిషన్‌ దాఖలు కావడం హైకోర్టులో అదే మొదటిసారి. వెంటనే ఉన్నత న్యాయస్థానం కేసుని పరిశీలించి అన్ని చెట్లని కాకపోయినా ఎక్కువ వయస్సున్న చెట్లని పరిరక్షించాలని ఆదేశం ఇచ్చింది.

పెద్ద ఖర్చేం కాదు..
సేవ్‌ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసే సంస్థ ఆ సంస్థ వ్యవస్థాపకులు విజయ్‌ రామకుమార్‌- గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో చెట్లని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పెరిగింది. తొమ్మిదో నెంబర్‌ జాతీయ రహదారిని వేల కోట్ల రూపాయలతో విస్తరిస్తున్నారు. దానిలో ఐదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే చెట్లన్నింటినీ ట్రాన్స్‌లొకేట్‌ చేయవచ్చు. అంటే మరోచోట నాటొచ్చు. చెట్టుని తొలగించాలంటే ఎలాగూ ప్రొక్లెయిన్‌ని వాడి తవ్వుతారు కదా. దాన్ని ఎక్కడో దూరంగా నాటాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి పెద్దగా రవాణా ఖర్చు కూడా ఉండదు. ఇలా దాదాపు అన్ని చెట్లను పరిరక్షించవచ్చు. అందుకే మేం హైకోర్టుని ఆశ్రయించాం- అని చెప్పారు

ఎలా గుర్తించారు..
కోర్టు స్టే ఇచ్చిన తర్వాత పురాతన చెట్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. అప్పటికి ఐదువేలకు పైగా చెట్లని నరికేశారు. మిగిలిన చెట్లలో మర్రి, జువ్వి, చింత, మద్ది చెట్లని పరిశీలించి 36 చెట్లను ఆ కమిటీ గుర్తించింది. అవన్నీ 50 నుంచి 100 సంవత్సరాల వయస్సున్న చెట్లే. అందులో చౌటుప్పల్‌ నుంచి సూర్యాపేట వరకు 19 చెట్లు, సూర్యాపేట నుంచి నందిగామ వరకు 17 చెట్లు ఉన్నాయి. చౌటుప్పల్‌ ఇవతల అవతల ఉన్న ఎనిమిది చెట్లను తొలిగించి చిట్యాల రైల్వే బ్రిడ్జి దగ్గర ట్రాన్స్‌లొకేట్‌ చేశారు. చెట్టుకు చెట్టుకు మధ్య పది మీటర్ల దూరం ఉంచి వీటిని నాటారు. మిగిలిన చెట్లను సూర్యాపేట ప్రాంతంలో నాటారు.

ఏంటీ ట్రాన్స్‌లొకేషన్‌?
టమాట, బంతి చెట్లను పెంచడం మీరెప్పుడైనా చూశారా? నారు మొలిచిన తర్వాత పీకి వేరే చోట దూర దూరంగా నాటుతారు. ఆ మాటకొస్తే వరి అయినా. అది ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అయితే ఇది ట్రాన్స్‌లొకేషన్‌. అవి చిన్న మొక్కలు కాబట్టి చేతులతో నాటొచ్చు. కానీ పెద్ద పెద్ద చెట్లను ఎలా నాటుతారు? నాటినా అవి బతుకుతాయా? అంటే బతుకుతాయనే చెబుతున్నారు సేవ్‌ సెక్రటరీ దీపక్‌. కాకపోతే అది ఖర్చుతో కూడుకున్న పని. ముందు చెట్టు ఆకులను, కొమ్మలను తొలగించాలి. పెద్ద వేర్లని కోసేయాలి. పైకి లేపి వాహనంలో మరో ప్రాంతానికి తరలించి అక్కడ నాటాలి. తవ్వడానికి ప్రొక్లెయిన్‌, రవాణా చేయడానికి ట్రాలీ, దానిపై ఎక్కించేందుకు క్రేన్‌, చెట్టు చనిపోకుండా కాపాడేందుకు వేర్ల చుట్టూ పూసే రసాయనాలు అవసరమవుతాయి. ఈ వాహనాలన్నీ రోడ్డు విస్తరణలో వాడతారు కాబట్టి చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌ ఖర్చు మరీ ఎక్కువేం ఉండదు.

ఎంత ఖర్వవుతుంది?

ఎన్‌హెచ్‌ 9 పై గుర్తించిన చెట్లను ట్రాన్స్‌లొకేట్‌ చేయడంలో జిఎంఆర్‌ సంస్థకు హైదరాబాద్‌కు చెందిన గ్లాడ్‌ఫామ్‌ హార్టికల్చర్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహాయం చేసింది. చెట్టు సైజు, ట్రాన్స్‌లొకేట్‌ చేయాల్సిన ప్రాంతానికి గల దూరాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. చిట్యాల దగ్గర మేం లొకేట్‌ చేసిన చెట్లకు ఒక్కోదానికి 30 వేల రూపాయల నుంచి 50 వేల వరకు ఖర్చు అయింది అని చెప్పారు ఆ  సంస్థ డైరెక్టర్‌ భాస్కర్‌. కానీ కొందరు అధికారులు మాత్రం ఒక్కో చెట్టుకు 70 వేల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు చూపుతున్నారు. సేవ్‌ ప్రతినిధులేమో 30 వేల రూపాయలు కూడా కాదని వాదిస్తున్నారు.

పిఎస్‌ ః కట్‌ చేస్తే.. రెండు నెలల తర్వాత చెట్టు ఇలా చిగురువేస్తుంది. పూర్వ రూపంతో పోలిక లేదు కాని బతికింది అంతే చాలు. మళ్లీ అంతలా ఎదగాలంటే, వచ్చేపోయేవారికి నీడనివ్వాలంటే ఎన్నేళ్లు పడుతుందో!



Comments

latha said…
Excellent flow, good riming

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...