Skip to main content

ముచ్‌కుందా - ఒకచెట్టు ఆత్మకథ


ఈ అనంత కాలగమనంలో.. మహానగరాల ప్రస్థానంలో...ఏదో ఒకరోజు.. ఏదో ఒక క్షణం..చీకటి అలుముకుంటుంది. ఉజ్వలంగా వెలుగొందిన నగరాలన్నీ ఇలాంటి పెనువిషాదాన్ని చవి చూసినవే.
ఇది చరిత్ర చెప్పిన సత్యం.అలాంటి విషాదానికి, ప్రకృతి విలయానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ప్రాణధాత్రి.

ఒకప్పుడది..
తెల్లటి నురగల హారంతో పరవళ్లు తొక్కుతూ ఆందంగా కనిపించే నది.
పేరు ‘ముచ్‌కుందా’ నేడు చలనం లేని మూసీ. ఒక మురికి కాలువ.
దిగాలుగా కదిలే ఆ నీటిలో ఒక విషాదం ఉంది. చరివూతలో ‘మూడు రోజుల’ మచ్చ ఉంది.
ఏంటా మూడు రోజులు? అసలేమైంది? చెప్పేవావరు? ఉన్నారు. మూసీకి ఉత్తరానున్న ఉస్మానియా ఆసుపత్రి ఇన్‌పేషెంట్ బ్లాక్‌లో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ మూడు రోజులకు ఇదొక్కటే సజీవ సాక్ష్యం. 150 మందికి పునర్జన్మనిచ్చిన ఆ ‘ప్రాణధాత్రి’ ఆత్మకథ ఇది.

103 సంవత్సరాల క్రితం..
సరిగ్గా ఇదేరోజు.. ( సెప్టెంబర్ 24, 1908 - గురువారం)

ఆ రాత్రి.. బంగాళాఖాతంలో వాయుగుండమేదో ఏర్పడుతున్నట్లు భూమి పొరల్లోంచి నా వేర్లకు సంకేతం అందినట్లనిపించింది. నా ఒళ్లు జలదరించింది. అటూ ఇటూ చూశాను. నగరం ప్రశాంతంగా ఉంది. తుఫాను ముందు ఉండే ప్రశాంతత. నన్ను కలవరపెట్టింది. మర్నాడు.. (సెప్టెంబర్ 25, శుక్రవారం)ఉత్తరం నుంచి చిన్నగా ఈదురు గాలి మొదలైంది. ఆ రోజంతా నాకు గుండెలో గుబులుగానే ఉంది. చినుకుల కోసం చూస్తున్నాను. కానీ ఒళ్లంతా వణుకుతూనే ఉంది. శనివారం(సెప్టెంబర్ 26) మధ్యాహ్నం.. చిరుజల్లు మొదలైంది. 4 గంటల ప్రాంతంలో కొద్దిసేపు వాన గట్టిగా కురిసింది.

tree-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaకాసేపటికి మరో అరగంట సాధారణ వర్షం. తర్వాత ఆగిపోయింది. వర్షం వాయిదాల పద్ధతిలో కురుస్తోంది. రాత్రి 11.30 గంటలకు మొదలైంది అసలు కుండపోత. ప్రమాదమేదో ఎదురవుతుందని అనుకున్నానుగానీ.. జలవూపళయం ముంచుకొస్తుందని.. నగరాన్ని ముంచి వేస్తుందని.. మాత్రం ఊహించలేదు. ఆదివారం.. (సెప్టెంబర్ 27) రాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. ఆరంగుళాల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత... ఒకసారి తీవ్రంగా.. మరోసారి నిదానంగా.. మొత్తంగా రోజంతా వాన పడుతూనే ఉంది. ఆ రోజు అర్ధరాత్రి మేఘాలకు పూనకం వచ్చింది. వర్షం విశ్వ రూపమెత్తింది. అంతకుముందు వందేళ్లలో నేనెప్పుడూ అంతటి వర్షాన్ని చూడలేదు. జనావాసాలకు నీళ్లు రావడం ప్రారంభమైంది. కోల్సావాడీ(వూపస్తుత ఉస్మానియా ఆసుపత్రి ఏరియా) రోడ్లపైకి వరద నీరు చేరింది.

సోమవారం (సెప్టెంబర్ 28)...
ఇన్నేళ్ల నా జీవితంలో నేనిప్పటికీ.. ఎప్పటికీ మర్చిపోలేని రోజది.. ఆరోజు ఏం జరిగిందో చెప్పే ముందు...అంతకు ముందురోజు మూసీకి ఎగువన ఏమైందో చెబుతాను. హైదరాబాద్‌కు 22 మైళ్ల దూరంలో యెంటేర్ లోయ ఉంది. అందులో పాల్మాకుల చాలా పెద్ద చెరువు. కుండపోతకు ఆ చెరువు నిండు కుండయ్యింది. అది బద్దలై ఆదివారం ఉదయం చెరువుకు గండి పడింది. ఆ నీళ్లు వేగంగా దిగువన ఉన్న పార్తీ రిజర్వాయర్లోకి చేరాయి. అక్కడి నుంచి నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. మీరాలం ట్యాంకు కూడా పొంగి పొర్లింది. ఆ చుట్టు పక్కల చాలా చెరువులూ కట్టలు తెంచుకున్నాయి. ఆ నీరంతా ఆదివారం అర్థరాత్రి మూసీలోకి చేరింది. ఇక ఆ ఉధృతి నగరం వైపు దూసుకొచ్చింది.మూసీలో నిమిషనిమిషానికీ నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల వరకు తీరాల వెంబడి ప్రవహిస్తున్న నీరు మూసీ నుంచి పైకి లేవడం మొదపూట్టింది. కొద్ది సేపట్లోనే పూరానాపూల్ బ్రిడ్జీని తాకే వరకు పొంగింది. 3 గంటలకు ఒడ్డును దాటి నీరు బయటకు రావడం మొదలైంది.

Board-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaఉదయం 7 గంటలకు వరద పడగ విప్పింది. ప్రధాన ప్రవాహ దిశ నుంచి నీళ్లు పాయలు పాయలుగా చీలి నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చాయి. 9 గంటల వరకు అన్ని బ్రిడ్జీల(పురానాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్)పై ప్రవాహం మొదలైంది. 10 గంటలకు ఇమ్లీబన్ దీవి(వూపస్తుత ఎంజీబీఎస్) పూర్తిగా నీట మునిగింది. అదే సమయంలో నా చుట్టూ నీళ్లు చేరాయి. చూస్తుండగానే నన్ను 15 అడుగుల వరకు ముంచేశాయి. జనాలు హాహాకారాలు చేయసాగారు. కొందరు ‘అర్జునా.. అర్జునా’ అన్నారు. ఇంకొందరు ‘అల్లా’ని ప్రార్థించారు. అందరూ ప్రాణాలు నిలుపుకొనేందుకు పరుగులు తీశారు.చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయారు. కొందరు ఒక్కొక్కరుగా.. ఇంకొందరు గుంపులుగా నాపైకి ఎక్కారు. నా కొమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు. ప్రాణభయంతో వణికిపోతున్నారు. కొందరు భవనాపూక్కారు. ఇంకొందరు బురుజుల మీద నిల్చున్నారు. ఇంకొందరు దూరంగా పరుగులు తీశారు.

11 గంటలకల్లా మూసీలో నీళ్లు తారాస్థాయికి చేరాయి. నా చుట్టూ ఎటు చూసినా అరమైలు వరకు నగరం మునిగిపోయే ఉంది. మూసీ అడుగు భాగం నుంచి 700 అడుగుల పైకి నీళ్లు వచ్చాయన్నమాట.
ఉన్నట్లుండి హైదరాబాద్‌కు ఓ మహా సముద్రం వచ్చినట్లనిపించింది. మైలుదూరం వరకు నివాస ప్రాంతాలపైకి 20 అడుగుల దాకా నీరు చేరింది. వానదేవుడు ఆగ్రహించాడని.. మూసీ తల్లి కన్నెర్ర చేసిందని.. కట్ట మైసమ్మకు కోపం వచ్చిందని నా పైన కూర్చునవాళ్లు మాట్లాడుకుంటున్నారు. వరద ఉధృతి ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. తమ వారు ఎక్కడున్నారో.. వరదలో ఎక్కడ చిక్కుకుపోయారోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. మాలాగే క్షేమంగా ఉండాలని.. బతికుంటే చాలని దేవుడ్ని వేడుకుంటున్నారు. ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. మరో 45 నిమిషాల వరకు ఈ ఉధృతి అలాగే ఉంది. 11.45 ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ వంతెన వద్ద ఒక అడుగు నీరు తగ్గింది.
ఆపై ఇక నీరు తగ్గుతూనే ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వంతెన తేలింది. అది ధ్వంసమై కనిపించింది.కొద్దిసేపటికి ఇంకా వేగంగా తగ్గింది.

himayath-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema3-4 గంటల నడుమ నీరు మూసీ తీరానికి దిగి ప్రవహించింది. రాత్రి 8 గంటలకల్లా మామూలు వాన కురిస్తే మూసీ ఎలా ప్రవహిస్తుందో ఆ స్థాయికి నీరు చేరింది. ఆ తర్వాత చూస్తే.. కొట్టుకుపోయిన పూరిగుడిసెలు.. ఆనవాళ్లు లేని ఇళ్లు.. శిథిలాలైన భవనాలు.. ధ్వంసమైన వంతెనలు..గుట్టలుగా శవాలు.. మిగిలిన జనం చెట్టుకొకరు.. పుట్టకొకరు..ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారో... గుర్తు పట్టలేని పరిస్థితి. ఎక్కడ విన్నా ఆక్రందనలు.. ఆర్తనాదాలు.. ఎటు చూసినా భీభత్సం... భయానకం...ఆ వరదకు పేద గొప్ప తారతమ్యాలు లేవు.అందరికీ సమ(అ)న్యాయం చేసింది. తుపాను ధాటికి చారివూతక నగరం చిగురుటాకులా వణికింది. చిన్నపిల్లాడిలా భయపడింది. ఆ భయం పోవడానికి... బురద ఆరడానికి.. ఆ గాయం మానడానికి ఎంతో కాలం పట్టలేదు. కాలం గాయం చేస్తూనే మందును రాస్తుంది. మోడూ చిగురిస్తుంది..చీకటి నుంచే వెలుతురు ఉదయిస్తుంది. అంతటి విలయం నుంచి పునర్నిర్మాణం.. ఈ నగరానికి అదో పునర్జన్మ. నా కళ్లతో చూశాను.. ఈ నగర నవ నిర్మాణం.

ఆఫ్ ద రికార్డ్
మూసీ వరదల్లో నేను ఎంత మందిని కాపాడానో నాకు నిజంగా తెలియదు. నేనసలు లెక్కబెట్టుకోలేదు కూడా. 150 మందిని కాపాడినట్లు బోర్డు రాసి నా మెడలో వేశారు. నేరం చేసినవాడి మెడలో నెంబర్ రాసిన పలక వేసి ఫోటో తీసినట్లు. నేను పెరుగుతున్నా కొద్ది అది నా గొంతుకు బిగుసుకుపోతోంది. దీన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఇంకొందరయితే నాకు వారసత్వ హోదా ఇప్పించే ప్రయత్నం చేశారు. నేను చేసిన గొప్ప పనిని గౌరవిస్తూ.. ప్రతి ఏటా నవంబర్ 30న హాస్పిటల్ డేను ఈ ఆసుపత్రి సిబ్బంది ఇక్కడే నిర్వహిస్తుంటారు. నన్ను ‘ప్రాణధావూతి’గా అభివర్ణించారు. నాక్కావాల్సింది.. ఈ అవార్డులు రివార్డులు కాదు. తెల్లటి నురగలతో చూడడానికి అందంగా ఉండే మూసీని మురికికి పర్యాయపదంగా మార్చేశారు. ఆ మూసీకి పూర్వవైభవం మళ్లీ రావాలని ఆశగా ఉంది.

అప్పటి హైదరాబాద్ వ్యూ
osmania-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema- 1908లో మూసీ వరదలు వచ్చినప్పుడు ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పరిపాలిస్తున్నాడు.
- మూసీకి దక్షిణాన నిజాం ప్యాలెస్, ఇతర నవాబుల నివాసాలుండేవి. ప్రస్తుత పాతబస్తే అప్పటి హైదరాబాద్.
- ఉత్తరాన కొత్తనగరం మూడువైపులా ఉండేది. ప్రస్తుత ఛాదర్‌ఘాట్‌తో పాటు బ్రిటీష్ రెసిడెన్సీ.. ఇసామియా బజార్ అవి.
- అప్పటి మొత్తం నగర జనాభా 4.5 లక్షలు.
- పాల్మాకుల చెరువు, పార్తీ రిజర్వాయర్ ఉన్న శంషాబాద్ ప్రాంతంలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. సోమవారం ఉదయానికి 24 గంటల్లో 12 అడుగుల 18 అంగుళాల వర్షపాతం నమోదైంది.
- సోమవారం ఉదయం 2 గంటలకు ముంచుకొస్తున్న ముప్పును పసిగట్టిన అధికారులు నగరవాసులకు మొదటిసారిగా హెచ్చరికలు జారీ చేశారు. వరదలకు చదరపు మైలు విస్తీర్ణంలో జలవిలయం సంభవించిందని తర్వాత లెక్కలు కట్టారు.
- ఈ వరదల వల్ల సుమారు 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా.
- 19 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జనాభాలో మూడింట్లో ఒక వంతు అంటే దాదాపు 80 వేల మంది నిరాక్షిశయులయ్యారు.
- నిజాం తేరుకుని సహాయక చర్యల కోసం ప్రధాని కిషన్ ప్రసాద్ అధ్యక్షునిగా ఓ కమిటీని వేశారు.
- హిందూ పూజారుల సూచన మేరకు నిజాం మూసీ తీరానికి వెళ్లి పూజలు చేసి విలువైన కానుకలు, ఆభరణాలు, చీరలు అర్పించారట.
- నిరాక్షిశయులైన వారిని నిజాం ప్యాలెస్‌లైన పురానా హవేలి, పంచ్ మహాల్లా ప్యాలెస్, జులుఖానా, ఫతేమైదాన్‌లలో ఆశ్రయం కల్పించారు.
- పరదాలో ఉండే మహిళలకు నవాబ్ ఫఖర్ ఉల్ ముల్క్ బహదూర్‌కు చెందిన అసద్ బాగ్‌లో ఆశ్రయం కల్పించారు.
- హిందూ ముస్లింలకు ప్రత్యేక వంటశాలలు తెరచి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 13 వరకు ఉచితంగా భోజన సదుపాయం సమకూర్చారు.
- అప్పట్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రాంతంలో అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి ఉండేది. వరదలకు అది దెబ్బ తినడంతో 1924లో ఏడో నిజాం ఇప్పుడున్న ఆసుపవూతిని కట్టించాడు.

జంట జలాశయాలు
himayath-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaమూసీ వరదలు నగరానికి గుణపాఠం నేర్పాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రళయం ఎదురైతే తీసుకునే జాగ్రత్తలను నేర్పాయి. వాటి ఫలితమే ఈ జంట జలాశయాలు. జంట నగరాల ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడంతోపాటు వరద ముంపు నుంచి పరిరక్షించేందుకు అప్పటి నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనల మేరకు ఈ ప్రాజెక్ట్‌లు రూపొందాయి. 1913లో అప్పటి నిజాం తన పేరు మీద ఉస్మాన్ సాగర్(గండిపేట చెరువు)కు శంకుస్థాపన చేశారు. నగరానికి సుమారు 12 కిమీ దూరంలో గండిపేట గ్రామం దగ్గర ఈ సాగర్ నిర్మాణం 1920లో పూర్తయింది. అప్పట్లో రూ. 58 లక్షలను దీని కోసం ఖర్చుచేశారు. ఇదే నదిపై 1927లో హిమాయత్ సాగర్‌కు శంకుస్థాపన చేశారు. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు నవాబ్ మీర్ హిమాయత్ అలీ ఖాన్ పేరుతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని కోసం సుమారు 93 లక్షల రూపాయలు వెచ్చించారు.


బీరెడ్డి నగేష్‌రెడ్డి

Comments

Hyma Reddy said…
article chala bagundi sir

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

గూగుల్ బతుకమ్మ

‘డిన్నర్ అయ్యాక పడుకోకుండా ఫేస్‌బుక్‌తో పనేంటి?’ అంటూ వాళ్ల డాడీ లతిక దగ్గరికి వచ్చాడు. లతిక కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తూ నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటోంది. ‘ఫేస్‌బుక్ ఓపెన్ చేశావనుకున్నాను ఇదేంటి?’ అని లతిక చేతిలోంచి బుక్ తీసుకున్నాడు. Bathukamma is a spring festival celebrated by the Hindu women of Telangana region in Andhra Pradesh, India. It is also called as Boddemma. This festival falls in the months of September/October called as Ashvin or Aswiyuja. Bathukamma festival is... అని రాసి ఉంది. ‘ఏంటిది బతుకమ్మ గురించి గూగుల్‌లో వెతికి రాసుకుంటున్నావా! ఎందుకు?’ అడిగాడు డాడీ. ‘అవును డాడీ! టీచర్ హోమ్‌వర్క్ ఇచ్చింది. ‘బతుకమ్మ’ గురించి ఎస్సే రాయమన్నది. ఆ ఫ్లవర్స్‌ని గ్యాదర్ చేసి రికార్డ్ తయారు చెయ్యమన్నది’ అని చెప్పింది. ‘మీ మమ్మీని అడక్కపోయావా. ‘మమ్మీకి నాకు చెప్పేంత టైమ్ ఎక్కడిది డాడీ! అందుకే ఇలా రాసుకుంటున్న. కానీ డాడీ.. ఇదేంటో అర్థం కావడం లేదు.. ’ ‘ఏంటది?’ ‘t..a..n..g..e...d..u.. వాట్ ఈజ్ దిస్ తంగెడు డాడీ?’ ‘ఓహ్.. తంగెడు.. అంటే ఫ్లవర్స్.. ఎల్లో కలర్‌లో ఉంటాయి.. మన తె...