Skip to main content

ఒక నజియా కోసం.. : 1947 నాటి చరిత్రాత్మక వీర తెలంగాణ ప్రేమకథ (నవల)









అరవై ఆరెళ్ళ తర్వాత ఒక ఉత్తరం తిరిగొచ్చింది..
మా తాత తన ప్రేయసి నజియాకు రాసింది..
అది చూసి ఆయన గుండె వేగం పెరిగింది..
హాస్పిటల్ బెడ్ మీద కొన ఊపిరితో ఆమెను కలవరిస్తున్నారాయన..
ఎవరీ నజియా? ప్రేమించుకుని ఎందుకు పెళ్ళి చెసుకోలేక పోయారు?
తాత వస్తానని ఉత్తరం రాసి.. ఎందుకు వెళ్ళలేదు? ఎవరీ నిజాం? అసలు ఆయన్ని ఎందుకు చంపాలనుకున్నాడు? మరి నజియా ఏమై పోయింది?
నేనిప్పుడు గుచ్చుకుంటున్న ఈ ప్రశ్నల కత్తులు గుండె ఒరలో పెట్టుకుని.. ముంబై నుంచి హైదరాబాద్ బయలుదెరుతున్నాను.
నా ప్రయాణం సమాధానాల కోసం, తాత కోసం మాత్రమే కాదు.. నాకు తెలియని నా ములాల కోసం కూడా..
ఈ కార్తీక్ రామస్వామి అన్వేషణ ఒక నజియా కోసం..

నా హీరోయిన్..
ఐదేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి కోసం రాసిన కథనం ఇది. (25.2.2010)
ఇదిగో ఈ ఫోటోలో ఎరుపు రంగు చీరలో వెలిగిపోతుంది చూశారా? తనే నా హీరోయిన్. 
ఇబ్రహీంపట్నం నుంచి నాయినంపల్లి వెళ్లే మార్గంలో వినోభానగర్ ఉంది. అక్కడ పచ్చని చెట్ల మధ్య పాలరాతి శిల్పంలా కనిపిస్తుంది ఓ ఆశ్రమం. జనజీవనానికి దూరంగా ఆహ్లాదకర వాతావరణంలో కనిపిస్తుంది "మాతాపితరుల సేవాసదనం.' అనాథలుగా మిగిలిన వృద్ధుల పాలిటి అమ్మ ఒడి అది. అక్కడ చేరాలంటే కొన్ని షరతులు. అయినవారు ఎవరూ ఉండకూడదు. వీళ్లకు అందరూ ఉన్నారు. కానీ ఎవరూ లేరు. ఈ ఐదుగురు బామ్మలతో పాటు మరో ముగ్గురు వృద్ధులు కూడా అక్కడ అప్పుడు ఆశ్రయం పొందుతున్నారు.
అప్పుడే కలిశాను తనను.
గణ గణా గంట మోగింది. భోజన సమయం అయిందనడానికి అది సంకేతం. ఓ గదిలో మంచంపై లేవలేని స్థితిలో మూలుగుతూ పడుకొని ఉంది. ప్లేటులో భోజనం పెట్టుకుని వచ్చి ఆమెని లేపింది ఓ పెద్దావిడ. ఆమె భుజాలు పట్టుకుని మెల్లగా లేపి కూర్చొబెట్టింది. ముద్దలు కలిపి పెడుతూ ఆమె వద్దంటుంటే "ఇంకొంచెం.. ఇంకొంచెం' అంటూ కొసరింది. అయినా వద్దని చేతితో ప్లేటు నెట్టబోతే "తినకపోతే ఎలా? చస్తావ్!' అని కోప్పడింది.
ఆమె చనిపోకూడదు అని అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు అనిపించింది. అందుకు ఒక నిజం మీకు చెప్పాలి.
ఆ ఆశ్రమ నిర్వాహకుడు నాకు చెప్పింది. ఈ కథనంలో రాయనిది.
నా నవలకు బీజం వేసినది.
ఆమె పేరు కనకమ్మ.
ఒకరోజు ఆ ఆశ్రమ నిర్వాహకుడు భాస్కర్ రావును పిలిచి. "ఇదిగో బిడ్డా ఇది నీ దగ్గర ఉంచు' అని ఇచ్చిందట.
తను చావుకు దగ్గరగా ఉందని ఆమెకే కాదు, ఆయనకూ అర్థమైంది.
"ఏంటిది? ఎందికిది?' అడిగాడట.
"దానికోసం ఒకరొస్తారు. లేదంటే కాస్టం మీద నా నోట్ల పెట్టు' అందట.
ఈ విషయం చెబుతున్నప్పుడు భాస్కర్ రావు కళ్లలో నీళ్లు చూశాను.
ఆ తడి..పుత్తడి.
అవును. ఆయన చేతిలో ఉన్నది చిన్న "బంగారం' బిళ్ల.
ఎవరీవిడ?
వచ్చే ఆ "ఒకరు' ఎవరు?
- - -
"ఆమె ఎక్కువ కాలం బతకదు'' గేటు దగ్గర చెబుతూ సెలవు తీసుకున్నారు పెద్దాయన.
ఆ సెలవు.. ఇప్పటికీ నా గుండెలో నెలవు.
ఆమె చనిపోయిందా? బతికుందా? అని ఈ ఐదేళ్లలో చాలాసార్లు లోలోపల అనుకున్నాను.
తెలుసుకోవడం పెద్ద పని కాదు.
కానీ ఆ నిజం నాకొద్దు.
తను బతికే ఉండాలి. ఇంకా బతికే ఉంది కూడా.
నా ఊహల్లో..
నా హీరోయిన్ గా..
కథలో రాజకుమారిలా.. ప్రేమగ మారి పిలిచింది..
కనకమ్మ.. నజియాగా మారింది.
ఆమె కోసం వచ్చే ఆ "ఒకరు'..
ఇప్పుడు ముంబై నుంచి బయలుదేరాడు..
కార్తీక్ రామస్వామి..

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...