Skip to main content

సిరులొలికించే కురులు

రాలిపోయిన తలవెంట్రుకలని నా చిన్నప్పుడు మా నాయనమ్మ గోడ దువ్విట్లో దాచిపెట్టేది. జడసవరాలు అమ్మేవాళ్లు వచ్చినప్పుడు ఆ జుత్తుని వాళ్లకిస్తే పిన్నీసులు, జడరబ్బర్లు ఇచ్చేవారు. ఊడిపోయిన జుత్తుకు అవి కాకపోతే ఇంకేం ఇస్తారు అని చీప్‌గా తీసిపారేయకండి. తలనీలాల వ్యాపారానికి మన రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉందని మీకు తెలుసా? 



పది ఇరవై ఏళ్ల క్రితం 'మొండబండ' తెగకు చెందినవారు ఊళ్లల్లో జడసవరాలు అమ్ముతూ, జుట్టును కొనుక్కెళ్లడం చాలామందికి తెలుసు. ఇప్పుడు కూడా అలాగే తీసుకెళ్తున్నారా? అని అడిగితే "ఔను. చాలా గ్రామాల్లో ఇప్పటికీ అలా జుట్టుని కొనేవాళ్లున్నారు. కాకపోతే జడసవరాలే కొనేవారు లేక అవి అంతరించి పోయాయి'' అని చెప్పారు వికాస్‌ హెయిర్‌ ఎంటర్‌ప్రైజర్స్‌ యజమాని పొగర్తి శంకర్‌. ఎనిమిది పుణ్యక్షేత్రాల నుంచి టన్నుల్లో తలనీలాలను సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారాయన.

అనాదిగా ఇదే పని
తమ్ముడు ఆదినారాయణతో కలిసి ఇరవై ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు శంకర్‌. వారి తాతముత్తాతలు కూడా ఇదే వృత్తిలో కొనసాగారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వెంట్రుకలు సేకరించేవారు. వాటిని సవరాలుగా తయారుచేసి అమ్మేవారు. శంకర్‌ తల్లిదండ్రులది ఖమ్మం జిల్లా ఖానాపురం. శంకర్‌ పుట్టకముందే ఆయన తల్లిదండ్రులు సికింద్రాబాద్‌ పార్సిగుట్టలో స్థిరపడ్డారు. వారిలా అక్కడ స్థిరపడ్డవి రెండొందలకు పైగా కుటుంబాలు ఉన్నాయిప్పుడు. ఆ ప్రాంతానికి జడసవరాల బస్తీగా పేరొచ్చింది. వీరందరిదీ ఇప్పటికీ ఇదే వృత్తి. శంకర్‌ తండ్రి నలభై సంవత్సరాల క్రితం బేగంబజార్‌లో జడసవరాలు అమ్మే ఒక దుకాణం పెట్టారు. ఇప్పటికీ ఆ దుకాణం ఉంది. అయితే ఇప్పుడు జడసవరాలు మాత్రం అమ్మడం లేదు. కేవలం వెంట్రుకలను కొనే పని మాత్రమే చేస్తున్నారు. "ఆదిలాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి చాలామంది తాము సేకరించిన జట్టును తీసుకొచ్చి మాకు అమ్ముతార''ని చెప్పారు ఆదినారాయణ.

భలే డిమాండ్‌
ఇళ్లలో సేకరించే జుట్టుతోనే ఇంత వ్యాపారం చేస్తుంటే తిరుపతి, యాదగిరిగుట్టలాంటి పుణ్యక్షేత్రాల్లో చాలామంది తలనీలాలు సమర్పిస్తారు కదా. మరి ఆ జుత్తుని ఏం చేస్తారు? అది ఇంకా పెద్ద వ్యాపారం. సదరు దేవాలయ నిర్వాహకులు తలనీలాల కాంట్రాక్టుకు టెండర్లు పిలుస్తారు. దేవాలయానికున్న ప్రాముఖ్యాన్ని బట్టి కొంత మొత్తాన్ని (లక్షల్లో) ముందే డిపాజిట్‌ చేయాలి. వేలంపాటలో ఎవరు ఎక్కువ మొత్తానికి పాడితే ఒక సంవత్సరం పాటు ఆ పుణ్యక్షేత్రంలో తలనీలాలు వాళ్ల సొత్తవుతాయి. అలా శంకర్‌ పదేళ్ల క్రితం ఒక దేవాలయంలో టెండర్‌ వేసి ఇప్పుడు ఎనిమిది దేవాలయాల్లో కాంట్రాక్టు పొందే స్థాయికి ఎదిగారు. "ఈ టెండర్లకు డిమాండ్‌ బాగా ఉంటుంది. తిరుపతి, శ్రీశైలంలాంటి పుణ్యక్షేత్రాల్లో కాంట్రాక్టు పొందాలంటే కోట్ల రూపాయలు కట్టాలి. మేం నల్గొండ జిల్లా చెర్వుగట్టు, వేములవాడలాంటి గుళ్లలో 20 నుంచి 30 లక్షల రూపాయలకు టెండర్లు గెలుచుకున్నాం'' అని చెప్పారు శంకర్‌.

వెంట్రుకల్ని ఏం చేస్తారు?
అన్ని దేవాలయాల్లోనూ రోజూ ఒకేలా తలనీలాలు సమర్పించరు. దీనికీ సీజన్‌ ఉంటుంది. అంటే సెలవులు, పండగలు, ఉత్సవాలు.. ఇలాంటప్పుడు ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రోజుల్లో మామూలే. "రోజువారీ సేకరించిన వెంట్రుకలను అక్కడ మేం నియమించుకున్న సిబ్బంది ఇక్కడికి పంపిస్తారు. వాటిని ముందుగా గ్రేడింగ్‌ చేస్తాం. మగవారి వెంట్రుకలు పనికిరావు. ఆడవాళ్ల జుట్టుని పొడవునుబట్టి వివిధ రకాలుగా విభజిస్తాం. అవి చిక్కులు పడి ఉంటాయి, కాబట్టి వాటిని యాంక్లర్స్‌ ద్వారా వీడదీస్తాం. తర్వాత కొన్నింటిని పిడి కిలి నిండా తీసుకుని దారంతో కట్టేస్తాం. పైభాగాన్ని సమానంగా కత్తిరించి డబ్బాలో ప్యాక్‌ చేస్తాం. ఈ పనులు చేసేందుకు మా దగ్గర 30 మంది పనిచేస్తున్నారు'' అని చెప్పారు ఆదినారాయణ.

విదేశాలకూ ఎగుమతి
ఇలా వెంట్రుకలతో వ్యాపారం చేస్తున్నవారు మన రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. పార్సిగుట్ట జడసవరాల బస్తీ నుంచి ఎక్కువమంది ఖమ్మం, ఏలూరు, చెన్నై, కలకత్తాలకు ఎగుమతి చేస్తున్నారు. వికాస్‌ హెయిర్‌ ఎంటర్‌ప్రైజర్స్‌, ఎల్బీనగర్‌లోని మరికొన్ని ఎంటర్‌ప్రైజర్స్‌ బ్రెజిల్‌, రష్యా, అమెరికాలాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కొన్నప్పుడు కిలో ఐదొందల రూపాయలుండే జుట్టు ప్రాసెస్‌ చేసి ఎగుమతి చేసేటప్పటికి 13 నుంచి 15 వందల వరకు ధర పలుకుతుంది. శంకర్‌ సోదరులు సంవత్సరానికి 30 నుంచి 50 టన్నుల వెంట్రుకల్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మంచి లాభం వచ్చినపుడు వాళ్లు ఎవరికి తలనీలాలు సమర్పించుకుంటారో!

ఫోటోలు : ఉలుసు బ్రహ్మానందం

Comments

Popular posts from this blog

ఈ తిట్లు వింటే మీరూ తెగ నవ్వుతారు..

తిట్టడం ఒక యోగం.. తిట్టించడం ఒక భోగం.. తిట్టలేకపోవడం... ఒక రోగం. అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు. ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది. అందుకే అలా. ఏడుపొస్తే ఆపుకోవడం.. కోపమొస్తే తిట్టకపోవడం.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్ చేయలేకపోవడం లాంటిది. అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా.. తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి. గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి. దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే.. What is the meaning of telugu word ne dumpa tega? (నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది. అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే. ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు. మొదటిది ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిం...

'ఛాయ' మిస్టరీ వీడినది

ఈ గుళ్లో ఓ మిస్టరీ దాగి ఉంది. పది శతాబ్దాల పైబడి ఎవరికీ అంతుచిక్కని రహస్యం అది. శివలింగంపై ఒక నీడ పడుతుంది. అది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో కూడా ఎవరికీ తెలియదు. గర్భగుడిలోని ఆ నిగూఢాన్ని ఇప్పుడు చేధించాడో ఫిజిక్స్‌ లెక్చరర్‌.  నల్గొండ పట్టణానికి ఆనుకుని పానగల్‌ ఉంది. ఆ ఊరి చివరన ఉదయ సముద్రం. దాని ఒడ్డున పచ్చని పొలాల మధ్య ఒక పురాతన దేవాలయం. 11వ శతాబ్దపు కుందూరు చోళుల కాలం నాటిది. దీని పేరే ఛాయా సోమేశ్వరాలయం. ఆ పేరులోనే ఉంది దాని మిస్టరీ. మనం ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడితే మన నీడ ఎక్కడ పడుతుంది? మన వెనకవైపు పడుతుంది కదా. అదే మధ్యాహ్నం నిలబడితే నీడ ముందుకు పడుతుంది. ఈ గుళ్లోని శివలింగంపై పడే నీడ ఉదయం అయినా, మధ్యాహ్నం అయినా ఎప్పుడూ కదలదు. ఇంకో విషయం... ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది. ఆ గుళ్లో ఎనిమిది స్తంభాలుంటాయి. కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒక స్తంభం నీడ అని మనం అనుకున్నామనుకోండి. దాని నీడపడినప్పుడు దాన్ని ముట్టుకుంటే మన చేయి నీడ కూడా పడాలి కదా? అలా పడదు. అయితే ఈ నీడ మరి ఎక్కడి నుంచి పడుతోంది, రోజంతా స్థిరంగా ఎలా ఉంటోంది? ఈ వి...

సామ్రాజ్ఞి రుద్రమ (మన చరిత్ర - 1) My new column in Batukamma Sunday Magazine

దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.. సమాజంలో బలంగా వేళ్లూనుకుపోయిన పురుషాధిక్యతపై సవాలు విసురుతూ ఓ వీరనారి రాజ్యాధికారం చేపట్టింది. ఆడదానికి రాజ్యమా? ఆడది పరిపాలించడమా? అని అయిన వాళ్లే ఆమె ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. కొందరు సామంతులు, మండలాధీశులూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. అయినా ఆమె అదరలేదు. బెదరలేదు. అలాంటి వారి తలలు వంచి, నోళ్లు మూయించి ధీర వనితగా, శత్రు భయంకర రుద్రరూపిణిగా నిలిచిందామె. నేటి స్వేచ్ఛా మహిళకు ప్రతీకగా, స్త్రీ ఆత్మగౌరవానికి సమున్నత పతాకగా.. గెలిచి నిలిచిన.. ఆమే.. రాజగజకేసరి.. రణరంగ ఖడ్గధారిణి.. కాకతీయ మహాసామ్రాజ్యభార ధారణి.. రాణీ రుద్రమ దేవి..  కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు అత్యంత పరాక్రమవంతుడు, రాజనీతి కోవిదుడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. మహిళలు రాజ్యాధికారానికి అనర్హులన్న అప్పటి కాలపరిస్థితులకు భిన్నంగా కూతురు రుద్రమదేవిని కుమారునిగా పెంచాడు. అన్ని విద్యలూ నేర్పించాడు. గణపతి దేవుడు రుద్రమను రాజప్రతినిధిగా ప్రకటించినప్పుడు స్త్రీ పరిపాలనను, స్త్రీ అధికారాన్ని సహించలేని సామంతుల నుంచి, దాయాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదురైనాయి. ఈ విపత్తులన్నింటినీ రుద్ర...